గజ్వేల్, జూన్ 26: హైదరాబాద్ చుట్టూ నిర్మించతలపెట్టిన ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) నిర్మాణంతో సాగుచేసే వ్యవసాయ భూములను కోల్పోవాల్సి వస్తున్నదని, సాగుకు అనుకూలంగా లేని భూముల్లో నుంచి ట్రిపుల్ ఆర్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆర్ఆర్ఆర్ భూనిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాధిత ర్యాలీ తీశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ర్యాలీగా ఇందిరాపార్కు చౌరస్తా మీదుగా ఐవోసీ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. చేబర్తి, నర్సన్నపేట, ఇటిక్యాల, పీర్లపల్లి, ఇప్పగూడెం, వర్గల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు ఐవోసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ బాధితులు ఇటిక్యాల భాస్కర్, ఎల్లారెడ్డి, చేబర్తి సాయిలు, చేబర్తి బాల్నర్సయ్య మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో సాగు భూములు కోల్పోతుండటంతో రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నదని అన్నారు. అలైన్మెంట్లో మార్పులు చేయాలని ఉగాది రోజున రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి విన్నవించగా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. కానీ, ఇప్పుడు రెవెన్యూ అధికారులు భూసేకరణ కోసం నోటీసులు పంపుతున్నారని, మంత్రి మాటకే విలువ లేదా అని నిర్వాసితులు ప్రశ్నించారు.
ఇక్కడ రైతులకు అనుకూలంగా మాట్లాడిన కోమటిరెడ్డి.. ఢిల్లీలో ఆర్ఆర్ఆర్ నిర్మాణం కోసం కేంద్ర మంత్రులను కలవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు, సొరంగాల నిర్మాణం కోసం చాలామంది రైతులు సాగు భూములు కోల్పోయారని, మరోసారి భూములు ఇవ్వాలంటే ఇక తమకు ఆత్మహత్యే తప్ప మరే మార్గం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రీజినల్ రింగ్రోడ్డు పనులు వెంటనే ఆపి, తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.