బండి మాటలు నమ్మితే నిండ మునుగుడే!
కేంద్రాన్ని పాలించే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాయన, ఎంపీగా ఉండి పూర్తి అబద్ధాన్ని.. పచ్చి తప్పును, నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా ఏదిబడితే అది మాట్లాడొచ్చా..? ఆయన మాట్లాడింది శుద్ద తప్పు. ఆయనకు నెత్తిలేదు… కత్తిలేదు. జిమ్మెదారి లేదు. బాధ్యత లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఇప్పుడే కాదు.. చాలా రోజుల నుంచి ఇట్లనే మాట్లాడుతున్నడు.. నేను కూడా ఆయన మాటలను క్షమిస్తూ వచ్చిన. నా స్థాయి మనిషి కాదు…చిన్నవాడు అని పట్టించుకోలేదు. నా మీద వ్యక్తిగతంగా అడ్డదిడ్డంగా మాట్లాడినా పట్టించుకోలేదు. ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగతవని వదిలిపెట్టిన. కానీ, మరీ టూమచ్గా చేస్తున్నడు.. తెలంగాణ రైతులను ఏడేండ్ల నుంచి కంటికి నిద్ర లేకుండా కాపాడి… ఒక స్థాయికి తెచ్చి… వారి అప్పులు కట్టించి గడ్డకేసి వారు బాగుపడాలని మేము తీసుకోని పోతావుంటే… మొత్తం రైతాంగం బతుకునే ఆగం చేసే విధంగా బాధ్యత లేకుండా మాట్లాడుతుంటే ఏమనాలి..? నీకేమి గావాలె… రైతులు ధాన్యం పండియ్యాలె… నీవు ఢిల్లీలో తీసుకోవు… ఇక్కడ రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయాలె… రాజకీయంగా పబ్బం గడుపుకోవాలె… అంతే గదా!వానకాలంలో 62 లక్షల ఎకరాల వరిపంట వేసిన్రు. కోతలు స్టార్ట్ అయినయి. ధాన్యం వస్తున్నది. ఎంత ధాన్యం తీసుకుంటరో ఈరోజు వరకు కమ్యూనికేషన్ లేదు. సుమారు కోటి 70 లక్షల టన్నుల వరకు ధాన్యం వస్తే, కోటి 10 లక్షల టన్నుల వరకు రైస్ వస్తుంది. వానకాలం పంటనే తీసుకునే దిక్కులేదు. దానికే లెటర్ రాలేదు. బండి సంజయ్ యాసంగిలో వరి వేయాలంటున్నడు.
నేను రైతాంగానికి చెప్తున్న…
ఈ బండి సంజయ్ సొల్లు కబుర్లు నమ్మి … పనికి మాలిన మాటలు నమ్మి… వరి పంట కనుక వేస్తే దెబ్బతింటం. తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో వరి పంట మనకు క్షేమదాయకం కాదు. ధాన్యం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మేము తీసుకోమని నిరాకరిస్తున్నది.ధాన్యం సంగతి ఏందో తేలుస్తం. కేంద్ర ఆహారశాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నా.. ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రకటించాలి. తెలంగాణ రైతాంగాన్ని మీరు మోసం చేస్తే ఊరుకోం..
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తేతెలంగాణ): కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ఉత్తర భారతంలో కొట్లాడుతున్న రైతులకు అండగా ఉంటామని, తాము కూడా ధర్నాలు చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పుడు మేం పెడుతం ధర్నాలు ఇగ. ఉత్తర భారతంలో రైతులు ఎవరైతో కొట్లాడుతున్నరో వారికి అండగా నిలుస్తం. రైతు వ్యతిరేక చట్టాలు మొత్తం విత్డ్రా చేసుకోవాలె. ధర్నా చేస్తం. డెఫినెట్గా సీరియస్గా కొట్లాడుతం. పెట్రోల్, డీజిల్ మీద పెంచిన సెస్లు వెంటనే విరమించుకోవలె. మిమ్ముల్ని పండనియ్యం, నిలబడనియ్యం’ అని చెప్పారు.
వ్యవసాయ రంగంపై కుట్ర
రైతు ఆయన పొలంలో ఆయనే జీతగాడిగా పనిచేయాలా? అగ్రికల్చర్ను కార్పొరేటీకరణ చేసే కుట్ర జరుగుతున్నది. ఈ కుట్రలను ఛేదిస్తాం. కుట్రను బయటపెడతాం. దీనిపై పార్లమెంటు దద్దరిల్లేలా చేస్తాం. రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడుతం. ధాన్యం కొనుగోళ్ల సంగతి కూడా పార్లమెంటులో పెడతం. మా రాష్ట్ర కోటా ఏందో నిర్ణయించాలని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేస్తం. 2,600 రైతు వేదికల్లో ధర్నా చేస్తాం. అవసరమైతే నాతో సహా మొత్తం తెలంగాణ కేబినెట్, తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం ప్రజాప్రతినిధులం పోయి, వడ్లు కొనాలని ఢిల్లీలో ధర్నా పెడతాం. పంజాబ్లో ధాన్యం 100 శాతం సేకరిస్తరంట. మరి తెలంగాణ ధాన్యం ఎందుకు కొనరు? మొదట దీనికి మీరు (కేంద్రం) సమాధానం చెప్పాలి. కేంద్రప్రభుత్వానికి రాష్ర్టానికో నీతి ఉంటదా? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మొత్తం ధాన్యాన్ని సేకరించాలి. తెలంగాణలో ప్రొడక్టివిటీ ఎక్కువ. దేశానికి నేడు తెలంగాణ అన్నం పెడుతున్నది. ఇది చూసి మీ (కేంద్రం) కండ్లు మండుతున్నయ్. తెలంగాణ రైతులు సంతోషపడితే మీ కడుపులు ఉడికిపోతున్నాయి. పిచ్చిపిచ్చి ప్రయోగాలు మానుకొని, జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా వ్యవహారం చెయ్యాలి.