Congress | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల వరుసగా చేసిన ఆరోపణలు ఇవి. రాజకీయ వర్గాల్లో, ప్రత్యేకించి కాంగ్రెస్ వర్గాల్లో ఇవి కల్లోలం రేపుతున్నాయి. అర్వింద్ వ్యాఖ్యలను రేవంత్రెడ్డి చీల్చిచెండాడుతారని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అర్వింద్పై రేవంత్ తన సహజశైలికి భిన్నంగా వ్యహరించేసరికి కాంగ్రెస్ నేతలు విస్తుపోతున్నారు. అర్వింద్కు రిన్సబ్బుకు రన్సబ్బుకు తేడా తెలియదని అంటూనే.. ‘మిత్రమా’ ధర్మపురి అర్వింద్గారు’ అని రేవంత్ సంబోధించడం గమనార్హం. దీనికితోడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తామే సీఎం అవుతామని భావించిన రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి పోటీలుపడి తమకు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేకించి నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి మధ్య నెలకొన్న అంతరాన్ని సీఎం రేవంత్రెడ్డి మరింత పెంచేలా ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలున్న నాయకుడిగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీర్తించడం వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ప్రచారంవైపు మళ్ల్లాయే కానీ, లేదంటే పరిస్థితులు వేరుగా ఉండేవని చెప్తున్నారు.
వ్యతిరేకవర్గం అనుమానాలు
బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు విమర్శించినా, ఆరోపణలు చేసినా ఒంటికాలిపై లేచే రేవంత్రెడ్డి.. బీజేపీలో చేరతారని అర్వింద్ రన్నింగ్ కామెంట్రీలా చెప్తున్నా ఎందుకు స్పందించడం లేదని ఆయన వ్యతిరేకవర్గం అనుమానం వ్యక్తం చేస్తున్నది. అర్వింద్ ఆరోపణలు నిజమైతే కాంగ్రెస్కు ప్రమాదం పొంచి ఉన్నట్టేనని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అర్వింద్ వ్యాఖ్యలపై రేవంత్ స్పందించకపోవడం నేతల్లో రేకెత్తిన అనుమానాలను మరింత బలపరుస్తున్నదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
‘ఆగస్టు వరకు సీఎంగా రేవంత్రెడ్డి ఉంటడో ఉండడో అంటున్నరు. రేవంత్రెడ్డి కుర్చీని శ్రీరాముడే రక్షించాలె’ ‘రేవంత్రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏబీవీపీ. లోపల హిందూత్వ ఉన్నది. కాంగ్రెస్ ఖాళీ అయిపోతదని అంటున్నరు. అందుకే రేవంత్రెడ్డి ఏమీ చేయలేక గోసపడుతున్నడు’‘కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నిలకడ ఉండదు. గెలిపించినా పార్టీలు మారుతనే ఉంటరు. 50 మంది ఎమ్మెల్యేలతో పార్టీ మారేందుకు సీఎం రేవంత్రెడ్డి సిద్ధంగా ఉన్నరు. రేవంత్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సరైంది కాదు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీజేపీలో చేరుతడు’.