Dharani | హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం శుక్రవారం నుంచి ఈ నెల 9 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ధరణి కమిటీ ఈ నెల 24న సీఎం రేవంత్రెడ్డితో సమావేశమైన సందర్భంగా ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. పరిష్కారమైన తర్వాత దరఖాస్తుదారులకు గ్రామస్థాయి అధికారి ద్వారా గానీ, వాట్సాప్, ఫోన్ మెసేజ్ ద్వారా గానీ సమాచారం అందిస్తారు. 2.5 లక్షల పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్టు సమాచారం.
తాజా మార్గదర్శకాలు ఇవే..
ఆర్డీవోలు, తహసీల్దార్లకూ అధికారాలు
ఇప్పటివరకు దరఖాస్తుల పరిష్కార అధికారం కలెక్టర్లకే ఉండేది. స్పెషల్ డ్రైవ్లో ఆర్డీవోలు, తహసీల్దార్లకూ కొన్ని అధికారాలను కట్టబెట్టారు. తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ వరకు ఏయే స్థాయిలో ఏయే మాడ్యూళ్ల కింద దరఖాస్తులను పరిష్కరించాలో స్పష్టంగా పేర్కొన్నారు. కిందిస్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకోవాలని స్పష్టం చేశారు. పత్రాలు, రికార్డులతోపాటు నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అప్రూవ్/రిజెక్ట్గా నిర్ధారణ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరించాల్సి వస్తే కచ్చితంగా సరైన కారణాన్ని వివరించాల్సి ఉంటుంది. తహసీల్దార్ పరిధిలో 7 రోజుల్లోగా, ఆర్డీవోలు 3 రోజుల్లోగా, అదపు కలెక్టర్లు 3 రోజుల్లోగా, కలెక్టర్లు 7 రోజుల్లోగా దరఖాస్తులను పరిష్కరించాలని స్పష్టం చేశారు.
కే, ఎల్ ఫారాలకు.. కలెక్టర్ పరిష్కారం
కలెక్టర్ స్థాయిలో కే అండ్ ఎల్ ఫారం దరఖాస్తులను పరిష్కరిస్తారు. వీటిని ముందుగా ఆర్డీవోలకు పంపాల్సి ఉంటుంది. వారు రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి నివేదిక తెప్పించుకోవాలి. వాటిని పరిశీలించిన అనంతరం కలెక్టర్కు నివేదిక పంపుతారు. దీని ఆధారంగా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. వీటితోపాటు టీఎం 3, 4, 15, 23, 24, 31, 33 మాడ్యూళ్ల కింద వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిష్కరించాల్సి ఉంటుంది. టీఎం-33లో పేరు మార్పు, ధరణికి ముందే కొంత భూమిని చదరపు గజాల్లో అమ్ముకోవడం, నాలా నుంచి వ్యవసాయ భూమిగా మార్పు, రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన భూముల మిస్సింగ్ సర్వే నంబర్/సబ్ డివిజ్ నంబర్/విస్తీర్ణంలో మార్పులకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్ మాత్రమే పరిష్కరిస్తారు.
సీసీఎల్ఏ స్థాయిలో టీఎం 33 కింద వచ్చి నోషనల్ ఖాతా నుంచి పట్టా మార్పు, భూమి రకంలో మార్పు, రూ.50 లక్షలకు పైబడి విలువైన భూముల విస్తీర్ణం/మిస్సింగ్ సర్వే నంబర్/సబ్ డివిజన్ నంబర్ మార్పులను పరిష్కరిస్తారు. క్షేత్రస్థాయి నుంచి నివేదిక తెప్పించిన తర్వాతే వీటిని పరిష్కరించాలి.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి: పొంగులేటి
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిశీలన సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ శాఖ, ధరణికి సంబంధించి 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటి పరిషారానికి శుక్రవారం నుంచి ఈ నెల 9 వరకు తహసీల్దార్ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని తెలిపారు. ధరణి పోర్టల్ను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని, త్వరలో ధరణిపై శ్వేతపత్రం విడుదల చేయబోతున్నామని ప్రకటించారు.