హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ పునర్నిర్మాణ నిపుణుల కమిటీ సర్వే అండ్ సెటిల్మెంట్శాఖ, వక్ఫ్బోర్డు, దేవాదాయశాఖ అధికారులతో సచివాలయంలో శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఆయాశాఖల రికార్డులు, సమస్యలు తదితర అంశాలపై చర్చించింది. మూడు శాఖల సమస్యలను అడిగి తెలుసుకున్నది.
ప్రస్తుతం సర్వే అండ్ సెటిల్మెంట్శాఖ నిర్వహిస్తున్న సర్వే రికార్డుల జాబితాతోపాటు వక్ఫ్బోర్డుకు సంబంధించి వక్ఫ్ బోర్డు కింద మొత్తం ఎంత భూమి ఉన్నది? కబ్జాలకు ఎంత గురైంది? వక్ఫ్ భూములను రిజిస్ట్రేషన్, రెవెన్యూశాఖ ఎలా రక్షిస్తున్నాయి? ధరణి పోర్టల్లో వక్ఫ్ భూముల సమస్య వం టి అంశాలను ప్రస్తావించారు. దేవాదాయశాఖపై దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న భూమి ఎంత? రక్షణకు తీసుకుంటున్న రిజిస్ట్రేషన్, రెవెన్యూశాఖ తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ధరణి పోర్టల్లో దేవాదాయ భూములు సమస్య ఏమిటి? అనే అంశాలపై చర్చించారు. సమావేశంలో సీసీఎల్ఏ నవీన్మిట్టల్, ధరణి పునర్నిర్మాణ కమిటీ సభ్యులు కోదండరెడ్డి, రేమండ్ పీటర్, సునీల్కుమార్, మధుసూదన్, సీఎమ్మాఆర్వో లచ్చిరెడ్డి, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.