Yadadri | యాదగిరిగుట్ట స్వయంభూ ప్రధానాలయంలో శుక్రవారం నుంచి ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తొలి రోజు ఆలయ ప్రాకార మండపంలో సాయంత్రం 5:30 గంటలకు అర్చకులు వేద మంత్రాలు పటిస్తూ అమ్మవారికి తిరుప్పావై పూజలు నిర్వహించనున్నారు. ఆలయ అర్చకులు ధనుర్మాన విశిష్టతను భక్తులకు వివరిస్తారు. గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలను రోజుకు ఒకటి చొప్పున 30 రోజుల పాటు పఠిస్తూ అర్చకులు మార్గళి పూజలు నిర్వహించనున్నారు.
ప్రధానాలయ పునఃప్రారంభం అనంతరం జరిగే మొదటి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ధనుర్మాసోత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవను సాయంత్రం 4:30 గంటలకు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.