హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం సివిల్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వికటించి. నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో కు.ని. ఆపరేషన్లు నిర్వహించినట్లు చెప్పారు. అనుభవం ఉన్న సర్జన్తోనే 34 ఆపరేషన్లు చేశారని పేర్కొన్నారు. ఆపరేషన్లు చేయించుకున్న వారంతా కొద్ది గంటలే ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో అనుభవజ్ఞుడైన వైద్యుడి ఆధ్వర్యంలో ఆపరేషన్లు జరిగాయని చెప్పారు.
ఆపరేషన్ చేయించుకున్న వారంతా కొద్ది గంటలే ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని.. ఆపరేషన్లు పూర్తి అయిన అనంతరం మహిళందరికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి ఇండ్లకు పంపించడం జరిగిందన్నారు. ఆ తర్వాత మహిళలు 26, 27 తేదీల్లో గ్యాస్ట్రో లక్షణాలపై ఫిర్యాదు చేశారన్నారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించడం, అలాగే ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం జరిగిందన్నారు. ఆపరేషన్లు చేయించుకున్న 34 మందిలో నలుగురు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇది బాధాకరమైన విషయమన్నారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇలాంటి ఘటనలు జరుగడం మొదటిసారన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నామన్నారు. ఘటనపై ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ మంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ మార్గనిర్దేశనం చేస్తున్నారన్నారు. అయితే, మృతి చెందిన నలుగురిని కాజ్ ఆఫ్ డెత్ కోసం నలుగురికి పోస్టుమార్టం నిర్వహించినట్లు చెప్పారు. తద్వారా మరణానికి కారణాలు తెలుసుకునేందుకు పోస్టుమార్టం ముఖ్యమన్నారు. మిగతా 30 మందిని నిన్న నుంచి స్క్రీనింగ్ చేస్తున్నామని, ఇండ్లకు ప్రత్యేక బృందాలను పంపి.. ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
30 మందిలో సోమవారం అర్ధరాత్రి ఏడుగురిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించామన్నారు. మరో ఇద్దరు మహిళలను నిమ్స్కు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు రెగ్యులర్గా జరిగే ప్రక్రియ అన్నారు. కు.ని. ఆపరేషన్లు తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమన్నారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమం 70 సంవత్సరాల కిందట ప్రారంభమైందన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు పబ్లిక్ సెక్టార్లో 16,147 ట్యూబెక్టమీ, ప్రైవేటు సెక్టార్లో 16,077 ట్యూబెక్టమీ ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందన్నారు.
మొత్తం 38,656 ఆపరేషన్లు జరుగుతుందన్నారు. ఇబ్రహీంపట్నం ఘటనపై ప్రభుత్వం పారదర్శకమైన విచారణ కోసం కమిటీని నియమించిందన్నారు. కమిటీకి విచారణ అధికారి డైరెక్టర్ హెల్త్ను నియమించిందని చెప్పారు. రాబోయే వారం రోజుల్లో అన్ని కోణాల్లో నిష్పాక్షపాతంగా విచారణ జరిపి.. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇబ్రహీంపట్నం ఆసుపత్రిని తక్షణమే సస్పెన్షన్ చేశామన్నారు. సర్జరీ చేసిన వైద్యుడి లెసెన్స్ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తాత్కాలికంగా రద్దు చేసిందని వివరించారు. వీళ్లే తప్పు చేశారని కాకుండా.. దర్యాప్తులో ఆటంకం కలుగకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని, అలాగే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కేవలం మహిళలకే పరిమితమయ్యాయన్నారు. పురుషులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అనేక రకాల ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.
మహిళలను కేవలం పునరుత్పత్తి సాధనలుగా చూడొద్దని సూచించారు. మహిళల ఆరోగ్యం చాలా ముఖ్యమైందని, కుటుంబంతో పాటు పిల్లల, వృద్ధుల బాధ్యతలను చూస్తారన్నారు. పిల్లలు వద్దుకొని ఆపరేషన్లు చేయించుకునేందుకు సైతం మహిళలే ముందుకు రావడం బాధాకరమన్నారు. ఇది చాలా బాధాకరమన్నారు. ఇది కేవలం మహిళలకే పరిమితం కాదని.. పురుషులు సైతం ముందుకు రావాలన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో దీనిపై ప్రభుత్వం తరఫున అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.