Telangana | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సమర్థ నాయకత్వం వల్ల ఈ ఏడాదంతా తెలంగాణ శాంతిభద్రతలతో పరిఢవిల్లింది. రాష్ట్రంలో ఎక్కడా, ఎలాంటి పెద్ద సంఘటన చోటుచేసుకోలేదు. చిన్నచిన్న ఘటనలు మినహా ఈ ఏడాది రాష్ట్రంలో అన్ని పండుగలు, అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీజీపీ రవిగుప్తా తెలిపారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో 2023 క్రైమ్ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2023లో లాఅండ్ఆర్డర్ సజావుగా నిర్వహించామని పేర్కొన్నారు. పోలీసుశాఖలో ఉమెన్ సేఫ్టీ వింగ్ తీసుకొచ్చిన షీటీమ్స్ సత్ఫలితాలు ఇస్తున్నదని తెలిపారు. ఈ ఏడాది బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధించే క్రమంలో 10,766 ఫిర్యాదులు స్వీకరిస్తే.. వాటిల్లో 850 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, 4,586 పెట్టీ కేసులు పెట్టామని వెల్లడించారు. మరో 14 జిల్లాలకు భరోసా కేంద్రాలు విస్తరించాయని వివరించారు. పని ప్రదేశంలో మహిళలో రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మే నెలలో ‘సాహస్’ను ప్రారంభించామని అన్నారు.
కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ పోర్టల్ (సీఈఐఆర్)లో తెలంగాణ పోలీసులు అగ్రస్థానంలో నిలిచారని డీజీపీ కొనియాడారు. పోయిన మొబైళ్లను కనిపెట్టి, బాధితులకు అప్పగించడంలో 33.8 శాతం సక్సెస్ రేట్తో మన పోలీసులు మొదటిస్థానంలో ఉన్నారని వెల్లడించారు. ఈ విధానం ద్వారా 15 వేలకు పైగా ఫోన్లను బాధితులకు ఇప్పించామని తెలిపారు. తెలంగాణ ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకు చెందిన సిబ్బంది ఆలిండియా బోర్డు ఎగ్జామ్స్లో టాప్ ర్యాంకులు సాధించారని వారిని అభినందించారు.
రాష్ట్రవ్యాప్తంగా మూడు చోట్ల మాత్రమే మావోయిస్టుల ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. 587 మంది సివిల్, ఐటీఅండ్సీ ఎస్సైలకు శిక్షణ ఇప్పిస్తున్నామని, 15,750 కానిస్టేబుల్ అభ్యర్థుల తుది ఫలితాలు కోర్టు పరిధిలో ఉన్నాయని అన్నారు. మన పోలీసులు 1,414 అవార్డులు, ప్రశంసాపత్రాలు పొందారని, 2023లో 22 ఐపీఎంఎస్, 4 పీపీఎం, 22 పీఎం గ్యాలంటరీ అవార్డులు సాధించినట్టు వివరించారు. ఫోరెన్సిక్ విభాగంలో దేశంలోనే తెలంగాణ మొదటి ర్యాంకు సాధించటం ఆనందంగా ఉన్నదని చెప్పారు. భరోసా సపోర్ట్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఈ-చలాన్ సిస్టమ్ అమలులో రాష్ర్టానికి రెండు స్కోచ్ అవార్డులు లభించాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 11,10,994 సీసీ కెమెరాలు అమర్చామని, ఈ ఏడాది కొత్తగా 1,00,145 కెమెరాలు ఏర్పాటు చేసినవేనని తెలిపారు. అలాగే సీసీటీఎన్ఎస్, ఐసీజేఎస్, టీఎస్కాప్ వంటి వాటితో నేరాలను ముందస్తుగానే గుర్తిస్తున్నామని వెల్లడించారు. పేపర్ కాస్ట్ను తగ్గించి పోలీసుశాఖలో ఈ-ఆఫీస్ అమలు చేస్తున్నామని అన్నారు. హెచ్ఆర్ఎంస్ యాప్ ద్వారా సకాలంలో ప్రమోషన్లు, రివ్యూలు, రివార్డులు ఇవ్వడానికి అవకాశం దొరికిందని వెల్లడించారు.
ఎఫెక్టివ్ ఫ్లీట్ మేనేజ్మెంట్ ద్వారా రూ.314 కోట్ల ఇంధనాన్ని ఆదా చేశామని చెప్పారు. రాష్ర్టాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నట్టు డీజీపీ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ యాంటి నార్కోటిక్ బ్యూరోకు ఏడీజీ ర్యాంకు అధికారిని నియమించామని వెల్లడించారు. గత ఆరు నెలల్లో టీఎస్న్యాబ్ ద్వారా 59 కేసుల్లో 182 మంది అరెస్టు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఏడీజీలు శివధర్రెడ్డి, శిఖాగోయల్, మహేశ్ భగవత్, సందీప్ శాండిల్య, విజయ్కుమార్, సంజయ్కుమార్జైన్, హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్బాబు తదితరులు పాల్గొన్నారు.