హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని నేర, మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసు వార్షిక నేర నివేదిక -2021ని డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగింది. కొవిడ్ సమయంలో పోలీసులు బాధ్యాతయుతంగా పని చేశారు. ఇతర శాఖల సమన్వయంతో ప్రజలకు సేవలందించారు. ప్రజల నుంచి పోలీసులకు మంచి పేరు లభించింది. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ సఫలీకృతమైంది. నేరాల నియంత్రణ, నేరగాళ్లను పట్టుకోవడంలో మంచి ఫలితాలు సాధించాం. రాష్ట్రాన్ని నేర, మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మావోయిస్టుల రాకపోకల కట్టడిలో సమర్థంగా పని చేశాం. 98 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. 133 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. మత ఘర్షణలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటూ పని చేస్తున్నాం. ఏడేండ్లుగా ఎలాంటి మత ఘర్షణలు జరగలేదు. నిర్మల్ జిల్లా భైంసాలోనే చిన్న గొడవలు జరిగాయి అని డీజీపీ తెలిపారు.
గతేడాదితో పోలిస్తే 4.65 శాతం నేరాలు పెరిగాయి అని డీజీపీ స్పష్టం చేశారు. 50.3 శాతం కేసుల్లో నేరగాళ్లకు శిక్ష విధించాం. 80 కేసుల్లో 126 మందికి జీవితఖైదు పడింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులను స్వీకరించినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. డయల్ 100కి 11.24 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఐదు నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటున్నారు. పేద, ధనిక తేడా లేకుండా పోలీసు శాఖ పని చేస్తోంది అని ఆయన స్పష్టం చేశారు.
800 పోలీసు స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ప్రారంభించామని డీజీపీ తెలిపారు. షీ టీమ్స్ 5,145 ఫిర్యాదులు స్వీకరించి భరోసా కల్పించాయి. హాక్ ఐ ద్వారా 83 వేలకు పైగా ఫిర్యాదులు స్వీకరించాం. 664 మంది నేరగాళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేశాం. రాష్ట్రంలో 8.5 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల ద్వారా కీలక ఆధారాలు లభిస్తున్నాయి. ఈ ఏడాది 8,828 సైబర్ నేరాలు నమోదు అయ్యాయి. రహదారి ప్రమాదాల్లో 6,690 మంది చనిపోయినట్లు డీజీపీ తెలిపారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలపై రూ. 879 కోట్లు జరిమానా విధించాం. సైబర్ నేరాలు, డ్రగ్స్ నిరోధానికి ప్రత్యేక డేటా బేస్ ఏర్పాటు చేశాం. ఈ ప్రత్యేక డేటా బేస్ ద్వారా 25 వేల కేసులు ఛేదించాం. ఈ ఏడాది రాష్ట్ర పోలీసులకు 11 జాతీయ అవార్డులు వచ్చాయని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.