హైదరాబాద్ : ఉద్యోగ విధి నిర్వహణను సమాజంతో పాటు ప్రభుత్వం, సంబంధిత శాఖ, ప్రజలు సగర్వంగా గుర్తించుకునే విధంగా ఉన్నప్పుడే ఆ అధికారిని ఉత్తమ సేవలందించిన అధికారిగా భావిస్తారని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విశేష లక్షణాలన్నీ సీఐడీ డీజీ గోవింద్ సింగ్కు ఉన్నాయని ఆయన ప్రశంసించారు. దాదాపు 32 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసి నేడు ఉద్యోగ విరమణ చేసిన సీఐడీ డీజీ గోవింద్ సింగ్కు సీనియర్ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు.
అడిషనల్ డీజీ జితేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏసీబీ డీజీ అంజనీ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, అడిషనల్ డీజీలు శివధర్ రెడ్డి, విజయ్ కుమార్, స్వాతి లక్రా, ఏకే జైన్, సందీప్ శాండిల్య, కె శ్రీనివాస్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐజీ కమల హాసన్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ పటిష్టం చేయడంలో ప్రధానమైన వర్టికల్ ఫంక్షన్ విధానాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో గోవింద్ సింగ్ కృషి చేశారని ప్రశంసించారు. సీఐడీ విభాగాధిపతిగా గత ఐదేండ్ల నుండి, అప్పటికే సుదీర్ఘంగా ఉన్న కేసులను పరిష్కరించడం, చార్జిషీట్లు వేయడంలోనూ, నిందితులకు శిక్ష పడడం తదితర అంశాలలో, గోవింద్ సింగ్ అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. యూఎన్వోలో పనిచేసిన నేపథ్యంలో అంతర్జాతీయ ప్రొసీజర్లను ఇక్కడి పోలీస్ చట్టాలకు అనుసంధానం చేయడం ద్వారా కీలక పాత్ర వహించారని ప్రశంసించారు. రాష్ట్రంలోని 800లకు పైగా పోలీస్ స్టేషన్లలో సీఐడీ కేసులను క్రోడీకరించి వాటినన్నింటినీ స్వల్పకాలంలో సమీక్షించే విధంగా చేయడం ఆయన వృత్తి నైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఆయన భార్య మరణించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
తనకు జరిగిన పదవీ విరమణ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుతూ డీజీ గోవింద్ సింగ్ మాట్లాడారు. ఉత్తమ ప్రమాణాలు కలిగిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేయడం అదృష్టమని పేర్కొన్నారు. ముఖ్యంగా సీఐడీ విభాగంలో అద్భుతమైన సేవలందించానని గోవింద్ సింగ్ తెలిపారు.