హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక శాంతిభద్రతల గురించి అపోహలున్నా.. వాటిని అధిగమించి శాంతియుతంగా ముందుకెళ్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. పోలీస్ శాఖకు సీఎం కేసీఆర్ దిశా నిర్ధేశం చేసి శాంతిభద్రతలకు పెద్దపీట వేశారని చెప్పారు. డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు అధికారులు తనపై చూపిన ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు. గత 36 ఏండ్లుగా పోలీస్ శాఖలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. తదుపరి డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న అంజనీ కుమార్కు అభినందనలు తెలిపారు. ఆయన నేతృత్వంలో పోలీస్ వ్యవస్థ మరింత ముందుకెళ్తుందని చెప్పారు.
పోలీసు వ్యవస్థను ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ప్రతి పోలీస్స్టేషన్ అవసరాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించామని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందేలా ఎన్నో చర్యలు చేపట్టామని తెలిపారు. దీంతో ఆపదలో ఉన్నవారికి పోలీసులు ఉన్నారనే నమ్మకాన్ని పోలీస్ వ్యవస్థ ఇచ్చిందని వెల్లడించారు. ప్రతి పోలీస్స్టేషన్ ఒక దేవాలయం లాందని చెప్పారు.
టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నో కేసులను పరిష్కరించామని అన్నారు. రానున్న రోజుల్లో నేరాలన్నీ డిజిటల్ రూపంలో జరుగుతాయని, అందువల్ల పోలీసులంతా టెక్నాలజీతో అప్డేట్ అవ్వాలని సూచించారు. విజనరీని దృష్టిలో ఉంచుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్ని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారి జీత భత్యాలు, సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అలవెన్సులు, హోమ్గార్డులకు రూ.20 వేల జీతాన్ని ఇస్తున్నామన్నారు. అర్బన్ ఏరియాలను కవర్ చేస్తూ ప్రభుత్వం 7 కమిషనరేట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 27 వేల మంది పోలీసులను రిక్రూట్ చేశామన్నారు. మరో 17 వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని చెప్పారు. అద్భుత పనితీరు కనబరిచిన పోలీసులందరికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల భద్రతకి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఇన్చార్జీ డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. దేశ అభివృద్ధికి తెలంగాణ ఇంజిన్ లాంటిదని చెప్పారు. పోలీసు వ్యవస్థలోకి టెక్నాలజీ తెచ్చేందుకు మహేందర్రెడ్డి కృషి చేశారని తెలిపారు. ఆయన తెచ్చిన సంస్కరణలను కొనసాగిస్తానని వెల్లడించారు. డీజీపీ హోదా ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. పదవీ విరమణ చేసిన మహేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ టీమ్తో కలిసి పనిచేయడం తన అదృష్టమన్నారు.