హైదరాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): వీలైనంత త్వరగా లొంగిపోయి, జనజీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టు పార్టీ నాయకత్వానికి, సభ్యులకు డీజీపీ ఎం మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున అన్నిరకాలుగా అండదండలు అందిస్తామని తెలిపారు. తెలంగాణ స్టేట్ కమిటీ కార్యదర్శి, సెంట్రల్కమిటీ సభ్యుడిగా కొనసాగిన దివంగత హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ భార్య, భద్రాద్రి కొత్తగూడెం-ఈస్ట్ గోదావరి డివిజనల్ కమిటీ సభ్యురాలు జజ్జేరి సమ్మక్క, అలియాస్ శారద శుక్రవారం డీజీపీ మహేందర్రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. శారదకు ఐదు లక్షల రివార్డు మొత్తాన్ని డీడీ రూపంలో, తక్షణ ఖర్చుల కోసం మరో రూ.5 వేలను డీజీపీ అందజేశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్, ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావులతో కలిసి డీజీపీ మీడియాతో మాట్లాడారు. శారద భర్త హరిభూషణ్ ఇటీవలే కరోనాతో మృతిచెందడం, ఆరోగ్య సమస్యలు పెరగడం, దాదాపు 25 ఏండ్ల తన మావోయిస్టు ప్రస్థానంలో సమాజం కోసం సాధించింది ఏమీ లేదన్న నిరాశతోనే తాను మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టు శారద తెలిపినట్టు పేర్కొన్నారు.