హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువచేయడం, నేరాల కట్టడిలో మరింత పక్కాగా వ్యవహరించేలా సిబ్బందిని కేటాయించడంపై పోలీస్శాఖ దృష్టి సారించింది. నగర పోలీస్ స్టేషన్లు, పట్టణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లు, సెమీ అర్బన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో పాతకాలం నాటి లెక్కల ప్రకారమే సిబ్బంది కేటాయింపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తగినవిధంగా మార్పులు చేయడంపై మంగళవారం డీజీపీ మహేందర్రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాలో సైబర్ల్యాబ్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీ గమనించడం.. సైబర్ క్రైం విభాగాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం సహా ఎన్నో మార్పులు తెచ్చారు. వీటిల్లో ప్రాధాన్యత ప్రకారం అటాచ్మెంట్ విధానంలో కాకుండా శాశ్వతంగా సిబ్బంది ఉండేలా ప్రస్తుతం ఉన్న వారినే పునర్వ్యవస్థీకరించాలని డీజీపీ సూచించారు. దీనిపై సమగ్ర నివేదికలను రూపొందించి రెండువారాల్లో సమర్పించాలని సూచించారు.