హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : పోలీస్ సిబ్బందికి ఇచ్చే శిక్షణ సమర్థంగా ఉండాలని పోలీస్ అకాడమీ డైరెక్టర్, డీజీ అభిలాష్ బిష్త్కు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అనుమతులు, ఇతర సంస్థాగత అవసరాల విషయంలో చీఫ్ ఆఫీస్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గురువారం పోలీస్ అకాడమీని సందర్శించిన ఆయన యూనిట్ దవాఖాన, పరిపాలనా విభాగం, ఆడిటోరియం, తరగతి గదులు, మెస్లు, క్రీడాభవన్, ఫైరింగ్ రేంజ్, పరేడ్ గ్రౌండ్ తదితర ముఖ్య భవనాలు, శిక్షణ సదుపాయాలను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో అకాడమీ డైరెక్టర్ శిక్షణ కార్యక్రమాలు, భవన సదుపాయాలు, నిర్వహించిన వర్షాప్లు, అకాడమీ ఎదురొంటున్న ప్రధాన సమస్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..
అన్ని ర్యాంకులకు చెందిన పోలీస్ సిబ్బందికి తప్పనిసరి శిక్షణ కోర్సులను క్రమబద్ధంగా నిర్వహించి, నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా వివరించారు. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల దర్యాప్తు, మోటరు వాహనాల చట్టం అమలు, రోడ్డు భద్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటివాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అకాడమీ అధికారులకు సూచించారు. తెలంగాణ పోలీస్ అధికారుల రీట్రీట్ కార్యక్రమాన్ని ప్రతియేటా నవంబర్ చివరివారం లేదా డిసెంబర్ మొదటివారంలో నిర్వహిస్తామని డీజీపీ ప్రకటించారు. అలాగే మహిళా సిబ్బందికి సంబంధించి సంసరణలు, సమగ్ర భాగస్వామ్యం, సంస్థాగత మద్దతు, వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి ‘తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ ఇన్ పోలీస్’ కార్యక్రమాన్ని ప్రతియేటా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో అకాడమీకి చెందిన సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.