హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ): అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్ (ఏజీపీఎల్)కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా సీమ్ (ఎస్ఈఐఎస్) కింద ఆ కంపెనీకి లభించే ప్రయోజనాలను పరిమితం చేస్తూ 2018లో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సర్యులర్ను రద్దు చేసింది. విదేశీ వాణిజ్య విధానంలో లేని నిబంధనలను కార్యనిర్వాహక సర్యులర్ ద్వారా చేర్చడాన్ని తప్పు పట్టింది.
2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఎస్ఈఐఎస్ కింద ఏజీపీఎల్కు మం జూరైన ప్రయోజనాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) పాలసీ సర్యులర్ ద్వారా పరిమితం చేశారు. వాస్తవ సేవలందించే సంస్థలకే ఎస్ఈఐఎస్ ద్వారా ప్రయోజనాలు పొందే అర్హత ఉంటుందని పేరొంటూ.. పోర్టు ఆపరేటర్ల ప్రయోజనాల పరిధి నుంచి ఏజీపీఎల్ను తప్పించారు. దీంతో వాణిజ్య విధానంలో లేని విషయంపై సర్క్యులర్ ద్వారా ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏజీపీఎల్.. ఇదే సర్యులర్ను ఇతర హైకోర్టులు రద్దు చేశాయని వివరించింది.
దర్యాప్తు సమయంలో తమపై బలవంతపు చర్యలు తీసుకోరాదని కోరుతూ రూ.2.95 కోట్లు చెల్లించినట్టు తెలిపింది. అనంతరం డీజీఎఫ్టీ సర్క్యులర్ చట్టబద్ధమైనదేనని ప్రభుత్వం ప్రతివాదన చేసింది. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు ఆ సర్యులర్ను రద్దు చేసింది. ఏజీపీఎల్ చెల్లించిన రూ.2.95 కోట్లను వడ్డీతో కలిపి 4 వారాల్లో తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.