హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): యాసంగిలో విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని, 15,500 మెగావాట్ల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తును సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావును ఆదేశించారు. శుక్రవారం అత్యధిక విద్యుత్తు డిమాండ్ 14,017 మెగావాట్లు నమోదు కావటంతో విద్యుత్తు సరఫరాపై సీఎం కేసీఆర్ సీఎండీ ప్రభాకర్రావుతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకొన్నారు. సాగునీరు పుష్కలంగా ఉండటం, సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగటంతో అదే స్థాయిలో విద్యుత్తు డిమాండ్ కూడా పెరుగుతుందని, అందుకు సిద్ధంగా ఉండాలని విద్యుత్తు యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. డిసెంబర్లో 14 వేల మెగావాట్లకుపైగా డిమాండ్ రావటం ఇదే తొలిసారి. సాధారణంగా యాసంగిలో మార్చి, ఏప్రిల్లో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదవుతుంది. కానీ ఈసారి సాగు విస్తీర్ణం భారీగా పెరగటంతో డిసెంబర్లోనే 14,017 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదయ్యిందని సీఎండీ ప్రభాకర్రావు సీఎం కేసీఆర్కు వివరించారు. గత ఏడాది డిసెంబర్లో 10,935 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. అప్పటితో పోల్చితే ఈ డిసెంబర్లో 3,082 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. గరిష్ఠ డిమాండ్ పెరుగుతున్నా విద్యుత్తు ఇంజినీర్లు, అధికారులు కష్టపడి పనిచేస్తూ నిరంతరం విద్యుత్తు సరఫరా చేయటంపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తంచేస్తూ వారిని అభినందించారు.
ఆటోమెటిక్ స్టార్టర్లు ఆఫ్ చేయండి: దేవులపల్లి ప్రభాకర్రావు, సీఎండీ, ట్రాన్స్కో, జెన్కో
విద్యుత్తు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని, మోటర్లకు పెట్టే ఆటోమెటిక్ స్టార్టర్లను ఆఫ్ చేయాలని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ప్రజలను కోరారు. భూగర్భ జలాలు పెరగటం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని చెప్పారు. అయినా వ్యవసాయ రంగానికి ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తును సరఫరా చేస్తామని, ఇందుకు రైతులు కూడా సహకరించాలని విన్నవించారు.
నీటిని, విద్యుత్తును వృథా చేయకండి: ఎస్పీడీసీఎల్ సీఎండీ
వ్యవసాయ రంగానికి విద్యుత్తు డిమాండ్ భారీగా పెరిగిందని, ఈ నేపథ్యంలో నీటిని, విద్యుత్తును వృథా చేయొద్దని రైతులను ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డి కోరారు. ఆటోమెటిక్ స్టార్టర్లను వాడొద్దని సూచించారు. తెలంగాణ వచ్చాక అన్ని రంగాల్లో కలిపి 65 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు. హైదరాబాద్లోని కల్యాణనగర్, ముఫకంజా, శిల్పారామం, క్రిష్ణానగర్, నాగోల్ సబ్స్టేషన్లలో ఆటోమెటిక్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఫాల్ట్ ఫైండింగ్ టెక్నాలజీని తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్పీడీసీఎల్కు 38 అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. గత ఏడాది జీహెచ్ఎంసీలో 3,450 మెగావాట్ల డిమాండ్ వచ్చిందని, ఈ సారి 4 వేల మెగావాట్లను దాటుతుందని ఆంచనా వేసినట్టు వెల్లడించారు.