Komuravelli Mallanna | చేర్యాల, జనవరి 20 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఈ ఆదివారంతో మొదలై 8 ఆదివారాలపాటు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఇందుకోసం ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఆదివారం పట్నంవారం నిర్వహిస్తారు.
ఈ వేడుక కోసం శనివారమే హైదరాబాద్ ప్రాంత భక్తులు భారీగా తరలివచ్చారు. గదులు దొరక్క కొందరు భక్తులు వచ్చిన వాహనాల్లోనే సేదతీరుతున్నారు. కొందరు ఖాళీ ప్రదేశాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకొన్నారు. ఆదివారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం మొక్కులు చెల్లించుకుంటారు. తిరిగి సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ తోటబావి సమీపంలో ఎడమవైపు ఉన్న కాంపౌండ్ వాల్ ప్రదేశంలో వీఐపీ పార్కింగ్, సిద్దిపేట, చేర్యాల, కిష్టంపేట, కొమురవెల్లి కమాన్ నుంచి వచ్చే వాహనదారులు బస్టాండ్ పక్కన పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, కొండపోచమ్మ టెంపుల్, ఐనాపూర్ నుంచి వచ్చేవారికి కొమురవెల్లి పెట్రోల్ పంపు వెనుక ఖాళీ ప్రదేశంలో పార్కింగ్కు అవకాశం కల్పించారు.