భీంపూర్, జనవరి 9 ; ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెన్గంగ భక్తజన సంద్రమైంది. పెన్గంగ పరివాహక డొలార, మహారాష్ట్ర పిప్పల్కోటి మధ్య గంగాజాతర సోమవారం సంప్రదాయబద్ధంగా మొదలైంది. గురుశిష్యులు రాంనందన్, మాధవరావు సమాధుల వద్ద భక్తులు పూజలు చేశారు. అనంతరం రథోత్సవం నిర్వహించారు. గంగమ్మకు గారెప్పాల నైవేద్యం సమర్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పురాతన జాతరల్లో ఇది ఒకటి. గంగాజాతరకు స్థానిక గ్రామాలతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఇక్కడ రంగుల రాట్నాలు, వివిధ తినుబండారాల దుకాణాలు, హోటళ్లు వెలిశాయి. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.