హైదరాబాద్: మాఘమ అమావాస్య.. అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించే రోజు. అందరి మనసులను భక్తి సాగరంలో ముంచెత్తే వేడుక. మాఘ మాసంలో బహుళ అమావాస్య అందరినీ దైవ సన్నిధికి నడిపిస్తూ మోక్ష ప్రాప్తి కోసం ఆలోచింపజేస్తుంది. ఏటా మాఘ అమావాస్య (Magha Amavasya) సందర్భంగా నిర్వహించే జాతరకు ఏడుపాయల దుర్గామాత ఆలయం ముస్తాబైంది. పుణ్యస్నానాల కోసం తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ప్రాంతాల నుంచి సుమారు లక్షమంది వరకు భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయం వద్ద షవర్లు ఏర్పాటు చేశారు. చెక్డ్యాంలో సైతం ఘనపూర్ ఆనకట్ట నుంచి నీటిని నింపారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. షామియానాలు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, నర్సాపూర్, మెదక్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నిలపడానికి టేకుల గడ్డ వద్ద ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని బొడ్మట్పల్లి, జహీరాబాద్, రాయిపల్లి, బీదర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నిలపడానికి నాగ్సాన్పల్లి వైపు ఉన్న చెలిమెల కుంట వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.