CM KCR | హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్థానిక సంప్రదాయలకు, ఆలయాలకు, పండుగలకు ప్రాధాన్యం కల్పించడంతో రాష్ట్రంలో ఆధ్మాత్మిక వైభవం ఉట్టిపడుతున్నది. దేశంలో ఎకడా లేనివిధంగా ప్రణాళికాబద్ధంగా ఆలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
ప్రధాన ఆలయాలకు మహర్దశ
కేసీఆర్ అధికారం చేపట్టిన వెంటనే ఆలయాల పునరుద్ధరణపై దృష్టిసారించారు. దేశంలోనే అత్యంత పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన యాదగిరిగుట్ట క్షేత్రాన్ని రూ.1,200 కోట్లతో పునర్నిర్మించారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధికి రూ.70 కోట్లు ఖర్చు చేశారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించారు. రూ.50 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, రూ.100 కోట్లతో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, రూ.25 కోట్లతో కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు.
ధూప దీప నైవేద్య పథకం
రాష్ట్రవ్యాప్తంగా 3,645 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేయగా, కొత్తగా 2,796 దేవాలయాలను చేర్చారు. ఈ పథకం ద్వారా అర్చకుల వేతనాలను రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. బుధవారం 2,043 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో హోమాలు
ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూ జలు, హోమాలు నిర్వహించనున్నారు. ప్రధాన ఆలయాల్లో మిల్లెట్ల ప్రసాదం పంపిణీ ప్రారంభించనున్నారు. సాయంత్రం హరికథలు, భక్తిగీతాలు వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాల కోసం ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆధ్యాత్మిక దివస్ను విజయవంతం చేయాలని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, దేవాదాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణమాచారి పిలుపునిచ్చారు.