వనపర్తి : పక్కా ప్రణాళికతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పిస్తున్నాం. పల్లె ప్రగతి కింద కరంట్, తాగునీళ్లు, పారిశుద్ధ్య తదితర సమస్యలు పరిష్కారిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. జిల్లాలోని పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పంచాయతీకి చెత్త సేకరణ, ఇతర అవసరాలకు ఒక ట్రాక్టర్చ, చెట్ల పెంపునకు ఒక నీటి ట్యాంకర్, హరితహారం కింద రహదారుల పక్కన చెట్ల పెంపకం, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనం, సాగునీటి రాకతో గ్రామాల స్వరూపం మారిపోయిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్నారన్నారు.
ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రమైన తాగునీటితోనే వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు. మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లా నీళ్లు విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో తొమ్మిదిన్నరేళ్లలో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. అభివృద్ది పనులు కొనసాగాలంటే పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.