ఘట్కేసర్,జూన్9 : రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుక వచ్చే క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం కేసీఆర్ పట్టణ ప్రాంతాలో క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. గురువారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో 66 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను చైర్పర్సన్ ఎం.పావని యాదవ్తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..క్రీడలతో పాటు ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు సైతం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు ఏడు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిదని మంత్రి పేర్కొన్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేసి ,మేలైన విద్యా బోధన జరిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పాఠశాలలతో పాటుగా, పట్టణ ప్రాంతాలలోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు మున్సిపాలిటీలలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
ఒక్కో మున్సిపాలిటీలో రెండు క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించడంతో ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలలో క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి మల్లారెడ్డి వివరించారు.
కార్యక్రమంలో కమిషనర్ వసంత, సింగిరెడ్డి రాంరెడ్డి, కౌన్సిలర్లు జాంగీర్, హేమలత గోపాల్ రెడ్డి, వెంకట్రెడ్డి,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బి.శ్రీనివాస్ గౌడ్,ఉపాధ్యాక్షుడు పి. వెంకటేశ్వరావు,ప్రధాన కార్యదర్శి బి.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.