రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం
పేదల్లో సంతోషం నింపేందుకే పథకాలు
28 నుంచి ఖాతాల్లో రైతుబంధు జమ
రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా..
ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు భరోసా
రాజన్న సిరిసిల్ల, జూన్ 24 (నమస్తే తెలంగాణ): పేదల కండ్లలో సంతోషం నింపి, వారి కుటుబాలకు భరోసా ఇచ్చేందుకే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నెల 28 నుంచి వానకాలం సీజన్కు సంబంధించి రైతుబంధు డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్ల బైపాస్రోడ్డులో ప్రభుత్వం ఇచ్చిన 4 ఎకరాల స్థలంలో రెడ్డి సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూర అంజిరెడ్డితో ప్రమాణం చేయించారు. తర్వాత సమీకృత కలెక్టరేట్లో న్యాయవాదులు, అన్ని కులసంఘాల నేతలతో సమావేశమై వారితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో పేదలకు ఉచిత భోజనం అందించేందుకు లయన్స్క్లబ్ ఏర్పాటు చేసిన మొబైల్ మీల్స్ వాహనాలను మంత్రి ప్రారంభించారు.
ప్రముఖ రచయిత జనపాల శంకరయ్య రచించిన ‘సిరిసిల్ల అభివృద్ధిపై బహుముఖ ప్రజ్ఞాశాలి కల్వకుంట్ల తారకరామారావు’ బుర్రకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంకు చెందిన 150 మంది యువకులు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. ‘తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ముందుకుపోతున్నాం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా.. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేవు’ అని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మెడికల్ కళాశాలలు మంజూరు చేసుకుంటున్నామని, బీసీలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని గౌరవం ఉన్నదని, అందుకే సమైక్య పాలనలో 16 బీసీ గురుకులాలుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 119కి పెంచిందని చెప్పారు.
‘కాళేశ్వరం’తో పెరిగిన భూగర్భ జలాలు
కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం పండుగలా మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శ్రీరాజరాజేశ్వర, అన్నపూర్ణ, మల్లన్నసాగర్, ఎగువ మానేరు ప్రాజెక్టులను నింపడం వల్ల భూగర్భ జలాలు 6 మీటర్ల ఎత్తుకు చేరాయని, ఐఏఎస్ల పాఠ్యాంశాల్లోనూ ఈ అంశాన్ని చేర్చారని తెలిపారు. సమైక్య పాలనలో కరెంటు తిప్పలు గుర్తుచేసిన కేటీఆర్.. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న విషయాన్ని పునరుద్ఘాటించారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ప్రతి పేదోడికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిరిసిల్ల కోర్టులో తాత్కాలిక భవన నిర్మాణం కోసం రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.
త్వరలో మెడికల్ కాలేజీలు
అభివృద్ధే తన కులమని, సంక్షేమం తన మతమని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. అన్ని కులాల వారికి అన్నలా సమస్యలు పరిష్కరిస్తానని, అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్ని కులాలు, మతాలకు సముచిత స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పద్మశాలి, రెడ్డి కులస్థులకు స్థలాలను కేటాయించి, ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు. గొల్ల, కుర్మ, మున్నూరుకాపుతో సహా అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలను కేటాయిస్తామన్నారు. త్వరలో మెడికల్ కళాశాలను, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్లు ఖిమ్యానాయక్, సత్యప్రసాద్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కూర అంజిరెడ్డి, కార్యదర్శి ఎగుమామిడి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పాల్గొన్నారు.