మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూరు పట్టణంలో అభివృద్ధి పనుల జాతర మొదలైంది. కనీవినీ ఎరగని రీతిలో పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీకారం చుట్టారు. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో ప్రతి వార్డుకు కనీసం రూ.50 లక్షల చొప్పున నిధులతో సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లికి స్థానిక ప్రజలు మేళతాళాలు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు.
అలాగే పలు వార్డుల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు పి. యాకన్న, ఉపేందర్ నేతృత్వంలో టీఆర్ఎస్లో చేరారు. పండుగ వాతావరణంలో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.