దేవరుప్పుల, మార్చి 20: జనగామ జిల్లా దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి మార్పుతో విభేదాలు భగ్గుమన్నాయి. చాలా కాలంగా లోలోపల ఉన్న గ్రూపు తగాదాలు అధ్యక్షుడి మార్పుతో బహిర్గతమయ్యాయి. రెండేండ్లుగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ఉన్న దేవరుప్పుల గ్రామానికి చెందిన పెద్ది కృష్ణమూర్తిని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి మంగళవారం బాధ్యతల నుంచి తప్పించి.. నీర్మాల గ్రామానికి చెందిన ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ను నియమించారు. పెద్ది కృష్ణమూర్తి ఒంటెద్దు పోకడలు, కార్యకర్తలు, నాయకులకు సమాచారం ఇవ్వడం లేదన్న ఫిర్యాదుల మేరకు ఝాన్సీరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
పలుమార్లు పెద్ది కృష్ణమూర్తిని పద్ధతి మార్చుకోవాలని ఝాన్సీరెడ్డి తెలిపినా ఆయన పట్టించుకోకపోవడమే దీనికి కారణమని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఝాన్సీరెడ్డి మంగళవారం తొర్రూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్ది కృష్ణమూర్తిని తొలగించి ఆ స్థ్ధానంలో నల్ల శ్రీరామ్ను మండల అధ్యక్షుడిగా ప్రకటించి సన్మానించారు. ఈ నిర్ణయంతో పెద్ది వర్గీయులు బుధవారం దేవరుప్పుల మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఆయన తొలగింపు అప్రజాస్వామికమని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అంతటితో ఆగకుండా.. మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేశారు. ఆఫీసులో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. పోలీసులు కాంగ్రెస్ కార్యాలయ షట్టర్లు కిందికి దించి కాపలా ఏర్పాటు చేశారు.