హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారిని హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు అరెస్టుచేశారు. మంగళవారం లక్ష్మీపతిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఏపీలోకి విశాఖపట్నానికి చెందిన కే నాగేశ్వర్రావు పేరు వెల్లడించాడు. దీంతో నాగేశ్వర్రావును బుధవారం అదుపులోకి తీసుకొన్నారు. ఇతడు హాష్ ఆయిల్ తయారు చేస్తూ లక్ష్మీపతి సహా ఇతర డ్రగ్స్ విక్రేతలకు సరఫరా చేస్తుంటాడని హెచ్న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపారు. కేసు వివరాలపై ఆయన నల్లకుంట పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. నాగేశ్వర్రావు గంజాయి పండించటంతో పాటు హాష్ ఆయిల్ తయారు చేసి అమ్ముతుంటాడని తెలిపారు. ఇతని కుటుంబం, బంధువులు కూడా డ్రగ్స్ దందాలో ఆరితేరినవారేనని వెల్లడించారు. లక్ష్మీపతితో పాటు తమిళనాడులో 13, ఒడిశా 14, ఢిల్లీ 8, కర్ణాటక 7, కేరళ 2, ముంబై 4, ఉత్తరప్రదేశ్లో 3, బీహార్లో ఒక కీలక స్మగ్లర్కు నాగేశ్వర్రావు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని వివరించారు. నాగేశ్వర్రావుపై నల్లగొండలో 2021లో కేసు నమోదైంది. అఫ్జల్గంజ్, నల్లకుంట పోలీస్స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ పోలీసులు గతంలో వైజాగ్ వెళ్లి ఇతని పరివారాన్ని అరెస్టు చేశారు. అప్పట్లో నాగేశ్వర్రావు తప్పించుకొన్నాడు. బుధవారం అతడితో పాటు, గంజాయి వినియోగిస్తున్న వంశీకృష్ణ, విక్రమ్ మౌర్యను అదుపులోకి తీసుకొన్నారు. వీరి వద్ద 840 గ్రాముల హాష్ అయిల్, నాలుగు సెల్ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకొన్నారు.
కిలో హాష్ ఆయిల్ 50 వేలు లక్ష్మీపతి ఇంజినీరింగ్ను మధ్యలోనే ఆపేసి, గంజాయి, గంజాయి నూనెను అమ్మటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే విశాఖపట్టణం జిల్లా అరకు మండలం లోగిలికి చెందిన నాగేశ్వర్రావుతో పరిచయమైంది. అతడి వద్ద కిలో హాష్ ఆయిల్ రూ.50 వేలకు కొన్న లక్ష్మీపతి.. ఆ ఆయిల్ను 5 గ్రాముల చొప్పున చిన్న డబ్బాల్లో నింపి, ఒక్కో డబ్బాను రూ.3వేల చొప్పున అమ్మేవాడని పోలీసులు తెలిపారు.