హైదరాబాద్, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ నలువైపులా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానల నమూనాలను రోడ్లు, భవనాలశాఖ అధికారులు సిద్ధం చేశారు. వైద్య అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన ఆయా నమూనాలను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం పరిశీలించారు.
ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పలు ప్రతిష్ఠాత్మక కట్టడాలపై మంత్రి వేముల తన అధికారిక నివాసంలో సమీక్ష నిర్వహించారు. వరంగల్లో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన, హుసేన్సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహం, నూతన సచివాలయం, అమరవీరుల స్మారక భవనం నిర్మాణ పనుల పురోగతిపై కూడా చర్చించారు.
అంబేద్కర్ జయంతినాటికి స్మృతి వనాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్మాణం చివరిదశలో ఉన్న సూర్యాపేట కలెక్టరేట్ భవనంతోపాటు వివిధ జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణ పురోగతిపై కూడా సమీక్షించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కలెక్టరేట్లతోపాటు హైదరాబాద్ నగర ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై కూడా మంత్రి అధికారులతో చర్చించారు. సమావేశంలో ఆర్అండ్బీ శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈ హఫీజుద్దీన్, ఈఈ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన
నూతన సచివాలయం నిర్మాణం పనులను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులతో కలిసి మంగళవారం రాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలని, అవసరమైతే కార్మికులను అదనంగా నియమించుకోవాలని సూచించారు.
సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ప్రధాన ద్వారంతోపాటు లోపల భాగంలో తుది మెరుగులు దిద్దాలని చెప్పారు. ఆయా పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫాల్ సీలింగ్, మార్బుల్ పాలిషింగ్, విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, డోమ్ మరింత ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందుబాటులో లేని పలువురు అధికారులకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు.