హైదరాబాద్, జనవరి20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏ ప్రాంతంలో, ఏ కాలంలో ఏవిధంగా భూగర్భజలాలు ఉంటున్నాయి? ఎంత మేరకు వినియోగించుకుంటున్నారు? వాటి నాణ్యత ఎలా ఉంది? తదితర వివరాల సమగ్ర సమాచారంతో రాష్ట్ర భూగర్భ జలశాఖ ‘తెలంగాణ గ్రౌండ్ వాటర్ అట్లాస్’, ‘దశాబ్దపు భూగర్భ జల నాణ్యత (2011-20)’ మ్యాప్లను రూపొందించింది. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ బిల్డింగ్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయా మ్యాప్లను రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్కుమార్, భూగర్భజలశాఖ విభాగం డైరెక్టర్ పండిత్ మద్నూరే ఆవిష్కరించారు.
నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ (ఎన్హెచ్పీ) కింద 38 థీమాటిక్ మ్యాప్లతో గ్రౌండ్వాటర్ అట్లాస్ను భూగర్భ జలశాఖ తొలిసారిగా రూపొందించడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరం, మిషన్ కాకతీయ, ఇతర పథకాలతో సగటు భూగర్భజల మట్టాలు 4.26 కంటే ఎకువ పెరగడానికి దారితీశాయని అధికారులు తెలిపారు. అట్లాస్ను రూపొందించిన భూగర్భ జలశాఖ డైరెక్టర్ పండిత్ మద్నూరేతోపాటు ఇతర అధికారులను రజత్కుమార్ అభినందించారు.