కోడేరు, జనవరి 30 : భూమిని విరాసత్ చేసేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) ఏసీబీకి చిక్కిన ఘటన సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కోడేరు రెవెన్యూ కార్యాలయంలో చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోడేరు మండలంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన చీకిరాల వెంకయ్య మృతి చెందాడు. అతని పేరుమీద కోడేరు మండలంలోని రేకులపల్లి గ్రామ శివారులో 1.12 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని తన పేరుమీద విరాసత్ చేయాలని వెంకయ్య కుమారుడు చీకిరాల సాయిబాబు గతేడాది జూలై 16న మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు.
రెవెన్యూ అధికారులు విరాసత్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండటంతో విసుగుచెంది కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కలెక్టరేట్ అధికారులు సమస్యను పరిష్కరించాలని కోడేరు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లను ఆదేశించారు. ఈ క్రమంలో.. పని చేయాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలని 20 రోజుల కిందట డీటీ పురుషోత్తం చీకిరాల సాయిబాబుకు చెప్పారు. చివరకు రూ.10 వేలు ఇస్తానని సాయిబాబు ఒప్పుకొన్నాడు. నాలుగు రోజుల కిందట సాయిబాబు, తన అన్న కుమారుడు చీకిరాల నాగేంద్రం కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం మధ్యా హ్నం డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తంకు నాగేంద్రం రూ.10 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్హ్యాండెడ్గా పట్టుకొన్నారు.మంగళవారం ఉదయం నాంపల్లి స్పెషల్ కోర్టులో డీటీని హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.