Bhatti Vikramarka | పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. 17 లోక్సభ స్థానాల కోసం మొత్తం 306 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. చివరిరోజైన శనివారం నాడు అత్యధికంగా 166 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేశారు.
భట్టి విక్రమార్క సతీమణి నందిని శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి 700 కార్లతో ఖమ్మం నగరం నుంచి బయల్దేరి హైదరాబాద్కు ర్యాలీగా చేరుకున్నారు. గాంధీ భవన్ వెళ్లి ఖమ్మం ఎంపీ స్థానం తనకు కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు రాయల నాగేశ్వరరావు, వడ్డే నారాయణరావు, శ్రీనివాసరెడ్డి, బుక్కా కృష్ణవేణి ఉన్నారు.