Yadadri | హైదరాబాద్/యాదాద్రి భువనగిరి, మార్చి 14(నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట ఆలయంలో ఇటీవల జరిగిన ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పనిచేస్తున్న రామకృష్ణారావును బాధ్యతల నుంచి తప్పించి రెవెన్యూశాఖ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఏ భాస్కర్రావును ఆ స్థానంలో నియమించినట్టు తెలిసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్టు సమాచారం. ఫారెన్ సర్వీసుల కింద డిప్యుటేషన్ పద్ధతిలో ఈ నియామకాన్ని జరిపినట్టు చెప్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను ఇతర మంత్రులతో సమానంగా కుర్చీల్లో కాకుండా చిన్న పీటలపై కూర్చోబెట్టారు. బలహీనవర్గాలకు చెందిన డిప్యూటీ సీఎంకు, దేవాదాయశాఖ మంత్రికి తీవ్ర అవమానం జరిగినట్టు రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
వివిధ దళిత, ప్రజాసంఘాలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. భట్టివిక్రమార్క జోక్యం చేసుకొని తనకు అవమానం జరగలేదని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం స్పందించింది. డిప్యూటీ సీఎంతోపాటు దేవాదాయశాఖ మంత్రికి తగిన ప్రాధాన్యం కల్పించకపోవడం ప్రొటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని భావిస్తూ ఆలయ ఇన్చార్జి కార్యనిర్వహణాధికారిగా కొనసాగుతున్న రామకృష్ణారావును ఆ బాధ్యతలనుంచి తప్పించినట్టు తెలిసింది. ఆయన స్థానంలో భాస్కర్రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్టు సమాచారం. అయితే, అధికారికంగా మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. కేసీఆర్ హయాంలో ఈఓగా కొనసాగిన విశ్రాంత అధికారి గీతారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దీర్ఘకాల సెలవుపై వెళ్లారు. దేవాదాయశాఖ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న రామకృష్ణారావుకు ప్రభుత్వం యాదగిరిగుట్ట ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రొటోకాల్ వివాదం నేపథ్యంలో రెండున్నర నెలల్లోనే ఆయనను బాధ్యతల నుంచి తప్పించినట్టు వార్తలు రావడం గమనార్హం.
యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి సాక్షి గా డిప్యూటీ సీఎం భట్టికి అవమానం జరిగిందంటూ ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన నేపథ్యంలో మరోమారు అలాంటి ఘటనలు జరగకుండా ఆలయ అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. కొత్తగా పది పీటలు కొనుగోలు చేశా రు. ఇప్పటికే నాలుగు పీటలు ఉండడంతో వీటి సంఖ్య 14 పెరిగింది. ఈ పీటలన్నీ ఒకే రకమైన ఎత్తుతో ఉండడం వల్ల ఒకేసారి 14 మంది వీవీఐపీలు వచ్చినా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆశీర్వచనం అందించేలా ఏర్పాట్లు చేశారు.