హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో శనివారం క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సెలబ్రేషన్ కమిటీతో ఆయన సమీక్ష నిర్వహించారు. పేద కుటుంబాలకు క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ, విందును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విందుకు సీఎం రేవంత్రెడ్డి హాజరవుతారని, అధికారులు ఏర్పాట్లు చేయాలని అన్నారు. క్రిస్మస్ను పేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్లు (దుస్తులు) పంపిణీ చేస్తున్నదని చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని 200 ప్రాంతాల్లో 500 మందికి చొప్పున, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెయ్యి మందికి చొప్పున గిఫ్ట్ ప్యాక్లు పంపిణీ చేయాలని, విందు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణ యాక్షన్ ప్లాన్ గురించి మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వివరించారు. అనంతరం క్రైస్తవులకు పంపిణీ చేసే దుస్తుల నాణ్యతను భట్టి పరిశీలించారు. సమావేశంలో ఎంసీహెచ్ఆర్డీ అడిషనల్ డైరెక్టర్ బీఎం ఎకా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, సైబరాబాద్ సీపీ మహంతి, రాచకొండ సీపీ సుధీర్బాబు తదితరులు పాల్గొన్నారు.