నల్లగొండ : యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర మంత్రుల బృందం పవర్ ప్లాంట్ను సందర్శించింది. బేగం పేట నుంచి హెలికాప్టర్లో విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ ప్లాంట్కు చేరుకున్నారు.
వీరికి సీఎండీ రిజ్వీ, కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందన దీప్తి స్వాగతం పలికారు. ముందుగా ప్లాంట్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎండీ గెస్ట్ హౌస్లో ఉన్నతధికారులతో ప్రాజెక్టు పనులపై రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.