హైదరాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): ప్రపంచ విత్తన భాండాగారంగా పేరుగాంచిన తెలంగాణ విత్తనరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మొత్తం విత్తనరంగానికి సంబంధించిన వివరాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ సీడ్ డాటాబేస్’ను సిద్ధం చేస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో ఎంత విత్తనోత్పత్తి జరుగుతున్నది, దాని విస్తీర్ణం, ఈ రంగంలో ఉన్న కంపెనీలు, ఏ కంపెనీ పరిధిలో ఎంత విత్తనోత్పత్తి అవుతున్నది, ప్రాసెసింగ్, ప్యాకింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎన్ని రకాల విత్తనోత్పత్తి జరుగుతున్నది వంటి పూర్తి వివరాలను సేకరించి ఆ డాటాబేస్లో పెట్టనున్నారు. ఇప్పటికే విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారులు కంపెనీల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రయత్నం పూర్తయితే.. దేశంలో విత్తనరంగంపై డాటాబేస్ సిద్ధం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలువనుంది.
రాష్ట్రంలో విత్తనోత్పత్తి, విత్తన శుద్ధి రంగం మెజార్టీగా ప్రైవేటు కంపెనీల ఆధీనంలో ఉంది. ప్రస్తుత విత్తన చట్టం ప్రకారం ఆ ప్రైవేటు కంపెనీలు తమ విత్తనోత్పత్తికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే విత్తనాలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. దీంతో తెలంగాణ విత్తనోత్పత్తికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో ఉంచడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కేంద్రంగా సుమారు 400 వరకు జాతీయ, అంతర్జాతీయ విత్తన కంపెనీలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇక్కడే విత్తనోత్పత్తి చేస్తుంటే మరికొన్ని కంపెనీలు ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తున్నాయి. తెలంగాణ నుంచి ప్రతియేట 24 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఇతర రాష్ర్టాలకు, దేశాలకు సరఫరా అవుతున్నాయి. దేశ అవసరాలకు 60 శాతం విత్తనాలు కేవలం తెలంగాణ నుంచే అందుతుండటం విశేషం. ఈ నేపథ్యంలోనే ప్రతి కంపెనీ నుంచి ప్రత్యేకంగా వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఆ వివరాల ఆధారంగా మరింత అభివృద్దికి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై స్పష్టత వస్తుంది.
ఒక్కసారి సీడ్ డాటాబేస్ అందుబాటులోకి వస్తే… రాష్ట్ర విత్తనరంగం మరింత వేగంగా అభివృద్ది చెందే అవకాశాలున్నాయి. సీడ్ డాటా ఆధారంగా రాష్ర్టానికి అవసరమైన విత్తనాలను ఉత్పత్తి చేయించి రైతులకు సకాలంలో సరఫరా చేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఎగుమతులకు అనుకూలమైన విత్తనాలను గుర్తించి వాటి ఉత్పత్తిని పెంచవచ్చు. దీంతోపాటు విత్తనరంగం అభివృద్ధికి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా సులువుగా ఉంటుంది.