హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): పంటల సాగులో వ్యవసాయ శాఖ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించటంతో పాటు ఎరువుల వినియోగం తగ్గించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పంటల సాగులో ప్రధానమైన ఐదు అంశాలను గుర్తించి వాటిపై ఫోకస్ పెట్టింది. వరి సాగులో వెదజల్లే విధానం అమలు చేయటం, పంట పొలాల్లో భాస్వరం నిల్వల కరిగింపు, రసాయన ఎరువులకు బదులు పచ్చిరొట్ట పైర్ల పెంపకం, దశలవారీగా ఎరువుల వినియోగం, పత్తి, కంది సాగు పెంపు అంశాలపై దృష్టి పెట్టింది. వానకాలం సీజన్ నుంచే ఈ విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో ప్రతి గ్రామం, మండలంలో కొంత మంది రైతులను ఎంపిక చేసి వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో) అవగాహన కల్పిస్తారు.
ఇందులో భాగంగా ఏఈవోలు ఏం చేయాలనేదానిపై వ్యవసాయశాఖ తాజాగా విధి విధానాలను రూపొందించింది. ఈ విధానాలకు అమలుకు సంబంధించి అన్ని జిల్లాలకు ఆదేశాలను జారీ చేసింది. గ్రామాలవారీగా క్లస్టర్ పరిధిలో కనీసం 25 మంది రైతులను ఎంపిక చేసి, 50 ఎకరాల్లో వరి పంట వెదజల్లే పద్ధతిని ప్రోత్సహిస్తారు. అదే క్లస్టర్లో 50 మంది రైతుల భూముల్లో భాస్వరం నిల్వలను కరిగించే పీఎస్బీ బ్యాక్టీరియాను వాడుతారు. మరో 30 మంది రైతులకు చెందిన 150 ఎకరాల్లో పచ్చిరొట్ట పైర్లను పెంచుతారు. మరో 50 మంది రైతుల 100 ఎకరాల భూమిలో యూరియాను ఒకేసారి కాకుండా విడతల వారీగా వినియోగించేలా చర్యలు తీసుకొంటారు.
1. వరి సాగులో వెదజల్లే విధానం
వరి సాగుకు కూలీల కొరత ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో వరి సాగులో నాటు విధానానికి బదులు విత్తనాలను వెదజల్లే పద్ధతిని వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తున్నది. ఈ విధానం ద్వారా కూలీల సమస్యకు చెక్ పెట్టడంతో పాటు పంటను ముందుగానే సాగు చేసుకొనే వెసులుబాటు కలుగుతుంది. ఎకరాకు రూ.8 వేల వరకు పెట్టుబడి ఆదా అవుతుంది. దిగుబడి పెరుగుతుంది.
2. పత్తి, కంది సాగు పెంపు
మార్కెట్లో పత్తి, కందికి భారీ డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ పంటలు సాగు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఈ వానకాలం సీజన్లో 2,488 క్లస్టర్లలో 70-75 లక్షల ఎకరాల్లో పత్తి, 71 క్లస్లర్లలో 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.
3. భాస్వరం నిల్వలను కరిగించాలి
రైతులు మోతాదుకు మించి డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తున్నారు. ఇందులో 80 శాతం వృథాగా పోతున్నది. ఇదంతా పొలాల్లో నిల్వ ఉంటున్నది. దీన్ని కరిగించి మొక్కకు అందిస్తే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల వినియోగం తగ్గించవచ్చు. ఇందుకు ఫాస్పరస్ సాల్వెబుల్ బ్యాక్టీరియా (పీఎస్బీ)ని వినియోగించాలి. ఒక బాటిల్ పీఎస్బీని వాడితే రెండున్నర ఎకరాలకు ఒక డీఏపీ బస్తా ఎరువు చల్లితే సరిపోతుంది.
4. పచ్చిరొట్ట పైర్ల పెంపుపై ప్రోత్సాహం
యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పచ్చిరొట్ట పైర్ల సాగు మంచి మార్గం. జీలుగ, జనుము, పిల్లిపెసర, పెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి పూత దశలో కలియదున్నటం వల్ల పంటకు అవసరమైన నత్రజని లభిస్తుంది. నేల సారవంతమై పోషక విలువలు పెరుగుతాయి. ఎకరం పొలంలో పచ్చిరొట్ట పంటను కలియదున్నటం ద్వారా రెండు యూరియా బస్తాలను తగ్గించుకోవచ్చు.
5. విడతల వారీగా ఎరువుల వినియోగం
నత్రజని, యూరియాను విడతల వారీగా వేసుకోవటం వల్ల దిగుబడి పెరుగుతుంది. ఎరువులను పొదుపుగా వాడటం వల్ల పెట్టుబడి తగ్గుతుంది. ఈ విషయాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు.
వ్యవసాయం | agriculture telugu | agri news telugu | cotton forming | telugu news