హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఏజెంట్లే మూలస్తంభాలుగా బీమా సంస్థల విస్తరణ జరుగుతూ ఉంటే.. వారిని నిరుత్సాహపరిచే విధంగా ఐఆర్డీఏఐ ప్రతిపాదనలు ఉన్నాయని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ డివిజనల్ ప్రధాన కార్యదర్శి జీ తిరుపతయ్య ఆందోళన వ్యక్తంచేశారు. ఐఆర్డీఏఐ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఎల్ఐసీ ఏజెంట్లు శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏజెంట్లకు తిరుపతయ్య సంఘీభావం ప్రకటించారు. ఐఆర్డీఏఐ ప్రతిపాదనలు నేలవిడిచి సాము చేసే విధంగా ఉన్నాయని, వాటిని అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. బీమా పాలసీ తీసుకోవాలన్న చైతన్యం సాధారణ ప్రజానీకంలో లేదని, వారిని ఒప్పించేందుకు ఏజెంట్లు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటారని అన్నారు. అలాంటి ఏజెంట్లకు ఇచ్చే కమీషన్ విషయంలో ఐఆర్డీఏఐ ప్రతిపాదనలు నీరుగార్చే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏజెంట్లు మొదటి ఏడాది అధిక కమీషన్ పొందడమే సమంజసమని అన్నారు. కానీ ఐఆర్డీఏఐ మొదటి ఏడాది తక్కువ, తదుపరి కాలానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని, ఇప్పటివరకూ ఈ రకంగా ఆదేశించిన సందర్భం లేదని అన్నారు. నూతన నిబంధనలు అమలైతే ఏజెన్సీ వృత్తి మరింత ఆదరణ కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు.
పాలసీ బాండ్లను డిమాట్ (డీ మెటీరియలైజ్) స్థితిలోకి తేవాలన్న రెండో ప్రతిపాదన మరింత ప్రమాదకరమైనదని తిరుపతయ్య తెలిపారు. ఈ ప్రతిపాదనతో పాలసీ విలువను స్టాక్ మార్కెట్కు తరలించే వెసులుబాటు ఏర్పడుతుందని, అత్యాశకు పోయే పాలసీదారులు తమ పాలసీ సొమ్మును అగమ్యగోచరమైన స్టాక్ మార్కెట్కు మళ్లిస్తే.. హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు వారు మొత్తం కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. విపత్తులకు పూచీకత్తుగా ఉండే బీమా వ్యాపారాన్ని చిన్నాభిన్నం చేసే దుర్మార్గపు ఆలోచనలో భాగమే ఈ ప్రతిపాదనలు అని విమర్శించారు. స్టాక్మార్కెట్లను తమ గుప్పిట్లో పెట్టుకొని ఒక్కరోజులో ప్రపంచ కుబేరులుగా ఎదగాలనుకునే వారికి అనుకూలంగా, స్థిర వ్యాపారాలను అస్థిరపరచి ప్రజల పొదుపు సొమ్మును, వారి భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేవిధంగా ఈ విధానాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు.