CM KCR | హైదరాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): అంబేద్కర్ పుట్టిన గడ్డపై దళితులకు దళితబంధు పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టరని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రశ్నించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మరోసారి డిమాండ్ చేశారు. సోమవారం ఔరంగాబాద్లో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రైతురాజ్యం రావాలని, దీనికోసం అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘దళితులు ఇంకా ఎంతకాలం వెనుకబడి ఉంటారు. వారిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉన్నది. దళితులు మన సోదరులు. అందుకే మేము దళితబంధు ప్రవేశపెట్టాం. ఫడ్నవీస్ ఇక్కడ కూడా దళితబంధును ప్రవేశపెడితే మహారాష్ట్రను వదిలి వేరే రాష్ర్టానికి వెళ్తాను. దేశం కోసం పాటుపడిన అంబేద్కర్ పుట్టిన గడ్డపై దళితబంధు ఎందుకివ్వరు? దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశాం. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరుపెట్టాం. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రధానిని కోరాను. నిజంగా మీకు అంబేద్కర్పై ప్రేమ ఉంటే పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని విజ్ఞప్తిచేశాను. దీంతో మొత్తం దేశం సంతోషిస్తుందని చెప్పాను.
మన కులం రైతు కులం కావాలి. మన మతం రైతు మతం కావాలి. మన అస్త్రం ఓటు కావాలి. మన లక్ష్యం రైతు సర్కారు కావాలి. ఇలా చేయడం వల్ల రైతు రాజ్యాన్ని స్థాపించవచ్చు. ఇలా చేసి చూడండి తెలంగాణలో మాదిరిగా నదీ జలాలు వాటంతట అవే వస్తాయి. తెలంగాణలో రైతులకు నీటి తీరువా లేదు. విద్యుత్తు చార్జీలు లేవు. ధాన్యం కూడా ప్రభుత్వమే కొంటుంది. ఇక్కడ కూడా అవన్నీ చేసుకునే వీలుంది. తెలంగాణలో అమలుచేసిన పథకాలన్నీ మక్కీ కి మక్కీ కాపీ చేస్తే సరిపోతుంది. ఇందులో బ్రహ్మవిద్య లేదు. అందుకే ఈసారి ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ రావాలి. ధర్మస్య జయోస్తు, అధర్మస్య వినాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కల్యాణమస్తు. జై మహారాష్ట్ర, జై భారత్.’
మనకి ఏది కావాలో దాని కోసమే పాటుపడాల్సి ఉంటుంది. పండు తినాలని ఉంటే పండ్ల చెట్టునే నాటాలి. ముళ్లచెట్టు నాటి పండ్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి. గాడిదకి గడ్డివేసి ఆవు పాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి. ఆవుకి గడ్డి వేస్తేనే పాలు వస్తాయి. ఓటు వేసేటప్పుడు మన మేలు కోసం పాటుపడేవారిని గుర్తించి ఓటు వేయాలి. అప్పుడు సమస్యలు పరిష్కారమవుతాయి. రైతులు, దళితులకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా.. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు. ఓటుహక్కును సరిగ్గా ఉపయోగించుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి. ఒక్కసారి ఓటును మన కోసం ఉపయోగించండి. మీరే సర్కారులోకి రండి. మీకు కావాల్సిన చట్టాలు చేసుకోండి. మన కిస్మత్ను మార్చుకునేందుకు ప్రయత్నించండి.