హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘లా’ కోర్సులకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఈ కోర్సుల్లో మొదటి విడత కౌన్సెలింగ్లోనే సీట్లు నిండిపోయాయి. ఈ ఏడాది లాసెట్ మొదటి విడత కౌన్సెలింగ్లోనే 85 శాతానికిపైగా సీట్లు భర్తీ అయ్యాయి.
ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం వంటి న్యాయవాద కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, పీజీ లాసెట్ వెబ్ కౌన్సెలింగ్ మొదటి విడత సీట్లను గురువారం కేటాయించారు. ఈ కౌన్సెలింగ్లో మొత్తంగా 6,894 సీట్లుండగా, 12,835 అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. వీరిలో 5,912 అభ్యర్థులు సీట్లను దక్కించుకున్నారు. సీట్లు పొందిన వారు ఈ నెల 6లోగా ఫీజు చెల్లించి, జాయినింగ్ రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. లా కోర్సుల తరగతులు డిసెంబర్ 4 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.