కంప్యూటర్ సైన్స్ కోర్సుకుఫుల్ డిమాండ్
సీటుకు 8-10 లక్షల దాకా..
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ).. ఇప్పుడు ఏ విదార్థి నోట విన్నా ఇదే మాట. కన్వీనర్, మేనేజ్మెంట్ ఏ కోటా తీసుకున్నా సీఎస్ఈ కోర్సు కోరుకుంటున్నవారే ఎక్కువ. ఫలితంగా మేనేజ్మెంట్ కోటా సీట్లకున్న డిమాండ్తో కాలేజీ యాజమాన్యాలు రేట్లను పెంచేస్తున్నాయి. చాలా కాలేజీల్లో ఎంసెట్కు ముందే ఈ సీట్లు బ్లాక్ అయ్యాయి. ఫలితాలు వచ్చాక ఇవి హాట్కేకులను తలపిస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని ఓ కాలేజీలో 15 రోజుల కిందట సీఎస్ఈ బీ క్యాటగిరీ సీటు రేటు రూ.8 లక్షలు ఉండగా.. ఇప్పుడు అదే కాలేజీ సీటు రేటును రూ.10 లక్షలకు పెంచేసింది. ఇక కన్వీనర్ కోటా సీట్లలో సైతం అత్యధికులు సీఎస్ఈనే కావాలనుకుంటున్నారు. ఇప్పటివరకు 59,594 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వారిలో ఎక్కువమంది సీఎస్ఈనే కోరుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఇవీ కారణాలు
మెడికల్, ఫార్మా, ఉత్పాదకరంగం.. ఇలా ఏది తీసుకున్నా సాఫ్ట్వేర్ ఆధారంగానే పనిచేస్తున్నాయి. ఇంజినీరింగ్లో ఏ కోర్సు చేసినా ఎక్కువమంది సాఫ్ట్వేర్రంగం వైపే చూస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలోనే ప్లేస్మెంట్స్ అధికంగా ఉండటంతో విద్యార్థుల ఆలోచనల్లో మార్పు వస్తున్నది. స్టార్టప్ కల్చర్ వేగవంతంకావడం కూడా ఈ డిమాండ్కు కారణం. ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీచేశాకే మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియను చేపట్టాలని తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఇటీవల స్పష్టంచేసింది. బీ క్యాటగిరీ సీట్ల భర్తీకి కాలేజీలు నోటిఫికేషన్ను ఇవ్వాలని పేర్కొన్నది.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
బీ క్యాటగిరి సీట్ల భర్తీపై మాకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఎవరైనా ఆధారాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. మేం ఇప్పటివరకు బీ క్యాటగిరి సీట్ల భర్తీ కోసం ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. జేఈఈ అడ్వాన్స్ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. సమస్యలుంటే ఫిర్యాదు చేయవచ్చు.