హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం, బీజేపీలోని ‘పెద్దోళ్ల’ పర్యవేక్షణలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడిచిందని తేలిపోయింది. దీపావళికి నాలుగు రోజుల ముందు ఎమ్మెల్యేల చేరికల వార్త కోసం ‘పెద్దాయన’ ఢిల్లీలో ఎదురు చూశారట. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఈ నీచ రాజకీయ కుట్ర మొత్తం బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ కనుసన్నల్లోనే సాగిందని స్వయంగా రామచంద్ర భారతి వెల్లడించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ద్వారా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి గుంజేందుకు బీజేపీ దూతలు ప్రయత్నిస్తే.. నమ్మినట్టు నటిస్తూనే వాళ్లనే రోహిత్రెడ్డి
ట్రాప్ చేయడంతో సాములు అడ్డంగా బుక్కయిపోయారు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి రెండు ఆడియో టేప్లు శుక్రవారం వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో బహిర్గతం అయ్యాయి. ఇందులో అనేక సంచలన విషయాలు, విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. మొదటి టేప్లో.. మధ్యవర్తులు రామచంద్ర భారతి, నందకుమార్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి మాట్లాడుకున్నట్టు ఉన్నది. ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను ఎలాంటి హామీలు ఇచ్చి బీజేపీ లొంగదీసుకొంటున్నదో ఈ సంభాషణలు రుజువు చేస్తున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ‘హయ్యర్ లెవల్’ నుంచి అనుమతి వచ్చిందని, పార్టీ మారేవారి భద్రత, భవిష్యత్తుకు ఏకంగా కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంటుందని రామచంద్ర భారతి ఆ ఆడియో టేప్లో భరోసా ఇచ్చారు. దీనిని బట్టి ఆ ‘పెద్దోళ్లు’ ఎవరో, నంబర్-1, నంబర్-2 ఎవరో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
బల్క్ సిద్ధంగా ఉంటే బీఎల్ సంతోష్ వస్తారు
ఒకసారి నేరుగా కలిసి మాట్లాడాలని రోహిత్రెడ్డి కోరగా.. తాను 24 వరకు బెడ్రెస్ట్లో ఉన్నానని, ఆ తర్వాత వచ్చి కలుస్తానని రామచంద్ర భారతి చెప్పారు. ఈ వ్యవహారం మొత్తం బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ కనుసన్నల్లో జరుగుతున్నట్టు స్పష్టం చేశారు. పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉంటే ఆయన నేరుగా వస్తారని చెప్పారు. తనతో సహా ముగ్గురం సిద్ధంగా ఉన్నామని రోహిత్రెడ్డి చెప్పగా.. ‘బల్క్ రెడీగా ఉంటే బీఎల్ సంతోష్ వస్తారు’ అని రామచంద్ర భారతి ఆ టేప్లో పేర్కొన్నారు. నందకుమార్తో మాట్లాడిన అన్ని విషయాలకు ఒప్పుకొంటున్నామని, అందులో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. దీనిని బట్టి అడిగినంత ఇవ్వడానికి తాము సిద్ధమన్న సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు.. ‘నందూను నేరుగా సంతోష్ దగ్గర కూర్చొని మాట్లాడే స్థాయికి తీసుకొచ్చా’ అని, ఆయన చెప్పినవన్నీ జరుగుతాయని హామీ ఇచ్చారు. పార్టీలోకి వచ్చిన వారిని ఎలా ప్రమోట్ చేయాలో తమకు తెలుసునని, ఇది చాలా సులభమైన అంశమని చెప్పారు.
మునుగోడు ఎన్నికే టార్గెట్
మునుగోడు ఉప ఎన్నికలో గెలువడమే లక్ష్యంగా బీజేపీ ఈ నీచ రాజకీయాలకు పాల్పడిందని ఆడియో టేప్ ద్వారా స్పష్టం అవుతున్నది. బీజేపీలో చేరడానికి తనకేమీ తొందర లేదని, నందకుమారే తనను తొందర పెడుతున్నాడని రోహిత్రెడ్డి చెప్పారు. ‘మునుగోడు ఎన్నికల తేదీకి ముందే చేరితో మరోలా ఉంటుంది. అందుకే నందుపై ఒత్తిడి తెస్తున్నా. ఆయన నాలుగైదు రోజులుగా నిద్ర కూడా పోవడం లేదు. మరో ఇద్దరు, ముగ్గురి పేర్లను నందూ తీసుకొచ్చాడు. కానీ వద్దనుకొన్నాం. మా ఆర్గనైజేషన్కు స్ట్రాంగ్ లీడర్ కావాలనుకొన్నాం’ అని రామచంద్ర భారతి అన్నారు. దీనిని బట్టి పోలింగ్ తేదీకి ముందే బలమైన నాయకులను చేర్చుకొంటే టీఆర్ఎస్ను మానసికంగా దెబ్బకొట్టొచ్చని బీజేపీ భావించినట్టు స్పష్టం అవుతున్నది. దీపావళి తర్వాత కలుద్దామని రామచంద్ర భారతి చెప్పగా.. ఈ నాలుగైదు రోజుల్లో మరింత మందిని తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తామని నందకుమార్ చెప్పారు. దీనిని బట్టి బీజేపీ ఎంత పెద్ద స్కెచ్ వేసిందో ఊహించుకోవచ్చు.
ఈరోజు ఎక్స్పెక్ట్ చేశారు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వార్త కోసం ‘ఇద్దరు పెద్దోళ్లు’ ఒక రోజంతా ఢిల్లీలో ఎదురుచూసినట్టు ఆడియో టేప్లో ఉన్నది. ‘ఈ విషయం ఇద్దరికీ చెప్పారా? వాళ్లు ఈరోజే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా స్వామీజీ’ అని నందకుమార్ అడగగా.. ‘అవును, వాళ్లు ఈరోజే అనుకొంటున్నారు. అందుకోసమే ఢిల్లీలో ఉన్నారు’ అని రామచంద్ర భారతి సమాధానం ఇచ్చారు. సాయంత్రం వరకు ఎదురుచూసినా వార్త రాకపోవడంతో నంబర్-2 ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లిపోయినట్టు చెప్పారు. ‘నంబర్ 2తో కలిసి తుషార్ అహ్మదాబాద్ వెళ్తున్నారు. సాయం త్రం 4 గంటలకు వాళ్ల చార్టర్డ్ ఫ్లయిట్ బయలుదేరుతుంది’ అని భారతి చెప్పారు.
మీ రక్షణ బాధ్యత కేంద్రానిది
పార్టీ మారే విషయం బయటికి పొక్కితే తమ పని అయిపోతుందని, సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమను వదిలిపెట్టడని రోహిత్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ‘స్వామీజీ.. ఒకవేళ ఈ విషయం బయటికి వెళ్తే మా పని అయిపోతుంది. మా సీఎం గురించి మీకు తెలుసు కదా. చాలా దూకుడు స్వభావం గల వ్యక్తి. మా సీఎంకు తెలిస్తే మా పని పడతారు’ అని రోహిత్రెడ్డి అన్నారు. దీనికి ‘మీ రక్షణ బాధ్యత కేంద్రానిది’ అని రామచంద్ర భారతి భరోసా ఇచ్చారు. ‘మీ భద్రత, మీ భవిష్యత్తు అంతా కేంద్రం చూసుకొంటుంది. ఈడీ నుంచి ఐటీ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని పేర్కొన్నారు. ‘ఈ విషయం ఎవరికీ తెలియదు. ఏమైనా అనుమానం వస్తే వెంటనే రంగంలోకి దిగి కవర్ చేస్తాం. కేంద్రం నుంచి రక్షణ కల్పిస్తాం. మీ రక్షణ మా బాధ్యత. ఇలాంటి విషయాలను హ్యాండిల్ చేయడంలో బెంగాల్ ఎపిసోడ్లో మాకు మంచి అనుభవం ఉన్నది’ అని చెప్పారు. పైగా ‘అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఉన్నది. మనం ఈ నెల 26న కూర్చొని మాట్లాడుకొందాం’ అనడాన్ని బట్టి కేంద్రం, బీజేపీలోని పెద్దలే ఈ కుట్రకు మూలకారకులని స్పష్టం అవుతున్నది.
బీఎల్ సంతోష్ కనుసన్నల్లోనే..
బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలోనే ఫాంహౌజ్ ఆపరేషన్ నడిచినట్టు ఆడియో టేప్ను బట్టి తెలుస్తున్నది. ‘బీఎల్ సంతోష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. చాలా కీలక వ్యక్తి. బీజేపీకి సంబంధించిన అన్ని విషయాలను ఆయన చూస్తారు. ప్రభుత్వాల ఏర్పాటు, ఇతర వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తుంటారు. నంబర్ 1, నంబర్ 2లే సంతోష్ ఇంటికి వచ్చి చర్చిస్తారు. మేం ఎవరిని కలిసినా తుది నిర్ణయం బీఎల్ సంతోష్ తీసుకోవాల్సిందే’ అని రామచంద్ర భారతి స్పష్టంగా చెప్పారు. ఒకవేళ పార్టీ మారేందుకు సిద్ధమైతే నేరుగా సంతోష్ను కలిపిస్తానని, అదే రోజు నేరుగా నంబర్ 2 దగ్గరికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వీటన్నింటిని బట్టి బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలోని నంబర్ 1, నంబర్ 2 కనుసన్నల్లోనే ఈ కుట్ర మొత్తం జరిగిందని స్పష్టం అవుతున్నది.