హైదరాబాద్ : ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్, ఆలిండియా ఎలక్షన్ కమిషనర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎస్కే శ్రీవాస్తవ మంగళవారం హైదరాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రం అవలంభిస్తున్న వివిధ పద్ధతులను తెలుసుకునేందుకు ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలు, ఎన్నికల విధానాన్ని వివరించారు.
స్థానిక ఎన్నికల్లో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ‘టీ పోల్’ సాఫ్ట్వేర్లోని వివిధ మాడ్యూల్పై ఐటీ సెక్రెటరీ జయేశ్ రంజన్, ఐటీశాఖ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ముఖ్యంగా రవాణా రంగం, పెన్షనర్ల విషయంలో, పౌర సరఫరాలు, వ్యవసాయం, ఇతర రంగాల్లో వినియోగిస్తున్నారో అదే తీరుగా ఎన్నికల ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానంతో అనేక సంస్కరణలు తెచ్చామని తెలిపారు. అలాగే ‘ఫేస్ రికగ్నైజేషన్’, ఈ- ఓటింగ్ మాడ్యూల్స్పై వివరించారు.
ఈ సందర్భంగా శ్రీవాస్తవ మాట్లాడుతూ తెలంగాణ అతికొద్ది కాలంలోనే వివిధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్న తీరును కొనియాడారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకువచ్చిన సంస్కరణలను కొనియాడిన ఆయన.. రాష్ట్రం, ఎన్నికల సంఘం ఎంతో అభివృద్ధి సాధించాయని, చాలా సంతోషించదగ్గ పరిణామమన్నారు. ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమని, ఈ విషయాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అన్ని రాష్ట్రాల కమిషనర్లు, కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తానన్నారు. ఈ ప్రక్రియ ఇదే విధంగా కొనసాగిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.