హైదరాబాద్ : రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అల్లిన కుట్రలు ఒక్కొక్కటిగా వీగిపోతుండటం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ( MLC Deshapati Srinivas ) అన్నారు. మద్యం కేసులో ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు.
మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత వంటి నాయకులపై మోపిన అక్రమ కేసులు కేవలం రాజకీయ కక్షతో కూడుకున్నవని కోర్టు తీర్పుల ద్వారా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం రాజకీయంగా బద్నాం చేయడమే ధ్యేయంగా ఈ కేసులు బనాయించబడ్డాయని నిరూపితమయ్యిందని అన్నారు.
దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులను ఇబ్బంది పెట్టాలని చూసిన శక్తులకు ఇది గొడ్డలిపెట్టని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంతటి దుష్ప్రచారం చేసినా చివరికి సత్యమే జయించిందని,ఇది కేవలం వ్యక్తుల విజయం కాదు, భారత రాజ్యాంగం పట్ల నమ్మకాన్ని పెంచే న్యాయ విజయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని అభాసుపాలు చేయాలని చూసిన కుతంత్రాలన్నీ నేటితో పటాపంచలయ్యాయని తెలిపారు.