హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఢిల్లీకి చెందిన షెల్లియాస్ టెక్నోల్యాబ్స్.. బైకర్ల కోసం సరికొత్త హెల్మెట్ను తయారుచేసింది. కలుషితమైన గాలి పీల్చకుండా హెల్మెట్లోకి స్వచ్ఛమైన గాలి వచ్చేలా తీర్చిదిద్దింది. ఈ హెల్మెట్లో బ్లూటూత్తో అనుసంధానించిన యాప్ ఉంటుంది. అది హెల్మెట్ను ఎప్పుడు శుభ్రం చేయాలో రైడర్కు వెల్లడిస్తుంది. ప్రధానంగా శీతాకాలంలో గాలి కాలుష్యం కారణంగా ద్విచక్రవాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఢిల్లీలోని నోయిడాకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యుర్ పార్క్ ఈ స్టార్టప్కు సహకారం అందిస్తున్నది. ఇప్పటికే ఈ హెల్మెట్ టీఆర్ఎల్ (టెక్నాలజీ రెడీనెస్ లెవల్)లో లెవల్ 9లో గుర్తింపు పొందింది. తొలివిడత రూ.4500 ధరతో హెల్మెట్లను దేశంలోని కొన్ని ప్రాంతాల ద్విచక్రవాహనదారులకు అందించారు. వారు తెలియజేసిన స్పందన, ఇతర సమస్యలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని మార్పులు చేస్తున్నారు.
ఎలా పనిచేస్తుందంటే..
ఈ హెల్మెంట్కు గాలిని శుద్ధిచేసే ప్రత్యేక వ్యవస్థ జోడించి ఉంటుంది. దీనిలో బ్రష్లెస్ డీసీ బ్లోయర్ ఫ్యాన్ ఉంటుంది. హై ఎఫిషియెన్సీ పర్టిక్యులేట్ ఎయిర్(హెచ్ఈపీఏ) ఫిల్టర్ ఉంటుంది. దీనిని ఎలక్ట్రిక్ సర్క్యూట్, మైక్రో యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ అన్నీ హెల్మట్లో జతచేసి ఉంటాయి. గాలిని శుద్ధి చేసే ఫ్యూరిఫయింగ్ వ్యవస్థ హెల్మెట్ వెనుక భాగంలో ఉంటుంది. ఈ వ్యవస్థ హెల్మెట్కు చేరే గాలిని శుద్ధి చేసి లోపలికి వచ్చేలా చేస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని ప్రమాణాలతో 1.5 కిలోల బరువుతో ఈ హెల్మెట్ను రూపొందించారు.