గజ్వేల్, డిసెంబర్ 10: అడవుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగున్నాయని ఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ రిసోర్స్ శాస్త్రవేత్త పరిమళన్ ప్రశంసించారు. పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో ప్రజల్లో పచ్చదనం, పర్యావరణ రక్షణపై ఆసక్తి పెరిగిందని అన్నారు. శనివారం సిద్ద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ యూనివర్సిటీలో జరిగిన సెమినార్కు ముఖ్యఅతిథులుగా హాజరైన శాస్త్రవేత్త పరిమిళన్, కేరళ ఫారెస్ట్ కళాశాల డీన్ ఈవీ అనూప్, హిమాచల్ప్రదేశ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ (ఐటీ విభాగం) అభిలాష్ దామోదరన్.. గజ్వేల్ నియోజక వర్గంలోని అడవులు, గజ్వేల్ అర్బన్పార్కును, జప్తిసింగాయపల్లి పల్లెప్రకృతి వనం, చెట్ల నర్సంపల్లి, సింగాయపల్లి అడవులను, ములుగులో నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు అడవులపై అవగాహన కల్పించడానికి అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చాలా మెచ్చుకోదగ్గ విషయమని అన్నారు.
డిసెంబర్లోనూ ఇంత పచ్చదనమా?
సాధారణంగా వర్షాకాలం అక్టోబర్ వరకే అడవులు పచ్చగా కన్పిస్తాయని, గజ్వేల్ నియోజకవర్గంలో తాము పరిశీలించిన డిసెంబర్లోనూ పచ్చదనంతో కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఎన్బీపీజీఆర్ శాస్త్రవేత్త పరిమళన్ అన్నారు. ప్రభుత్వం, అధికారులు చేపట్టిన సంరక్షణ చర్యలకు ఇది నిదర్శనమని తెలిపారు. అడవుల మధ్య ఏర్పాటు చేసిన కుంటలతో భూగర్భజలాలు సమృద్ధిగా అడవుల్లోని చెట్లు స్వీకరించడంతో ఇంకా పచ్చదనంగా ఉన్నట్టు తాము గుర్తించమని చెప్పారు. ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో శ్రమిస్తే ఇంత గొప్పగా పర్యావరణ మార్పు జరుగుతుందని నిరూపించారని కితాబిచ్చారు. గజ్వేల్ ప్రాంత అడవులను, అర్బన్పార్కు, పల్లెప్రకృతి వనాలను చూస్తే చాలా సంతోషంగా ఉన్నదని, ఇది మరపురాని రోజుగా గుర్తుపెట్టుకుంటామని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి గొప్ప అడవుల అభివృద్ధి, అవెన్యూ ప్లాంటేషన్ చూస్తామని ఊహించలేదని, దారిపొడవునా అడవులు, అందమైన పూల చెట్లు తమను మైమరిపించాయని తెలిపారు. వీరి వెంట గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి కిరణ్, ములుగు ఫారెస్ట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ అర్జున్ రాంచంద్రన్, కపిల్ సిహగ్, బీట్ ఆఫీసర్లు అర్జున్, షెకావత్ ఉన్నారు.