హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షల ఫలితాల్లో జాప్యం తగదని రాష్ట్ర డీఎడ్, బీఎడ్ సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిందని, అందులో సుమారు 70వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించిందని గుర్తు చేశారు. కానీ, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తాత్సారం చేయడం సరికాదని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి వచ్చే నెలలోనే 20 నుంచి 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని, వెంటనే ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ సర్కారు భర్తీ ప్రక్రియ చేపట్టిన 80, 039 ఉద్యోగాలకు అదనంగా మరో 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాలని కోరారు.