తొర్రూరు, ఏప్రిల్ 26 : అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన రాచర్ల దేవేందర్- భవాని దంపతుల పెద్ద కుమారుడు రాచర్ల కార్తీక్ (19) నాంచారిమడూరు శివారులోని మహాత్మా జ్యోతిరావుఫూలే డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కళాశాల డార్మిటరీలో ఎవరూలేని సమయంలో బెడ్కు అమర్చిన ఇనుప కడ్డీలకు బెల్ట్తో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు వెంటనే కార్తీక్ను తొర్రూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా, అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వర్ధన్నపేట ఏరియా దవాఖానకు తరలించారు. తమ కుమారుడు కార్తీక్ ఆత్మహత్య చేసుకోలేదని, కళాశాలలో ఏదో గొడవ జరిగిన క్రమంలో హత్యచేసి ఉంటారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. ఇది పూర్తిగా కళాశాలలో యాజమాన్యం తప్పిదమేనని, సీసీ కెమెరాల పుటేజీలను చూపించాలని డిమాండ్చేశారు. కార్తీక్ గతంలో ఎంసెట్ రాసి సీటు రాకపోవడంతో మళ్లీ ఈ సంవత్సరం పరీక్ష రాయాలని తండ్రితో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఈ దారుణానికి పాల్పడినట్టు తోటి విద్యార్థులు వెల్లడించారు. రాచర్ల దేవేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ తెలిపారు.