హైదరాబాద్/సిటీ బ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ)/ బన్సీలాల్పేట్: గాంధీ దవాఖానలో లైంగికదాడి ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను హోం మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ రాజారావుతో హైదరాబాద్లో మంత్రులు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఘటనపై దర్యాప్తు కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 4న చికిత్స కోసం గాంధీ దవాఖానలో చేరాడు. అతని వెంట ఆయన భార్య, కొడుకు అరుణ్, మరో దగ్గరి బంధువైన మహిళ వచ్చారు. 5వ తేదీన రోగిని మరో వార్డుకు తరలించటంతో మహిళలిద్దరికి అడ్రస్ దొరక్క తప్పిపోయారు. రోగి 11న దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యాడు. దవాఖానలో వెదికినా ఇద్దరు మహిళలు కనిపించలేదు. సోమవారం వారి దగ్గరి బంధువైన మహిళ తనపై ల్యాబ్టెక్నీషియన్, మరికొందరు లైంగికదాడికి పాల్పడ్డారని చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. రోగి భార్య ఇప్పటికీ కనిపించలేదు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి గాంధీ దవాఖానను సందర్శించి వివరాలు సేకరించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ కూడా గాంధీకి వెళ్లారు. లైంగికదాడి ఘటనపై త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయని దవాఖాన సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. అప్పటిదాకా మీడియాల సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని హోంగార్డుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హోంమంత్రి మహమూద్ అలీ హామీఇచ్చారు. లక్డీకపూల్లోని కార్యాయంలో హోంగార్డు అసోసియేషన్ సభ్యులతో కలిసి అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, మంత్రి శ్రీనివాస్గౌడ్తో భేటీఅయ్యారు.