Skywalk | నగర పరిధిలోని మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వెల్లడించింది. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్కై వే నిర్మించాలనే ప్రతిపాదనలున్నాయి. రైతుబజార్ ప్రాంతంలోని తమ భూములను ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకారం తెలుపకపోవడంతో ముందుకుసాగ లేదు. రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలం తమకు బదిలీ చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది.
ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో స్కై వాక్ ప్రతిపాదనలకే పరిమితమైంది. రైతు బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోతుండగా.. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ను కలిశారు. రక్షణ శాఖ భూములను తమకు బదిలీ చేయాలని కోరగా.. సానుకూలంగా స్పందించారు. అక్కడున్న ఢిఫెన్స్ జోన్కు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా స్కై వే డిజైన్లో సీఎం మార్పులు చేయించారు. సవరించిన కొత్త ప్రతిపాదనలను కేంద్రానికి పంపగా.. అవసరమైన మేరకు భూముల కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది.
3,380 చదరపు గజాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి రక్షణ శాఖ బదిలీ చేయనున్నది. బదులుగా కేంద్రం ఢిపెన్స్ విభాగానికి రూ.15.15కోట్ల విలువైన మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది. మరి కొంత స్థలానికి పదేండ్ల పాటు లైసైన్స్ రుసుం చెల్లించాలనే నిబంధనను కేంద్రం విధించింది. నాలుగువారాల్లోనే భూములను అప్పగించేందుకు అంగీకారం తెలిపింది. ముంబాయి హైవేలో అత్యంత కీలకమైన రైతు బజార్ జంక్షన్లో ట్రాఫిక్ సమస్యకు మోక్షం లభించనున్నది. వీలైనంత వేగంగా ఈ స్కై వే పనులు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.