Kagaznagar Forest | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఇటీవలి కాలంలో పులులు, సింహాల వంటి క్రూరమృగాలు తరచూ గ్రామాలు, పట్టణాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అడవిలో ఆహారం కరువై ఆకలితో అలమటిస్తున్న మృగాలు ఆహార అన్వేషణలో సమీపంలోని గ్రామాల్లోకి చొరబడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్లోనూ పులులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. వేటాడేందుకు వన్యప్రాణులు లేక ఆకలితో అలమటిస్తూ ఊర్లపై పడుతున్నాయి. కనిపించిన పశువులను చంపి ఆకలి తీర్చుకుంటున్నాయి. పులల చేతిలో హతమైన పశువుల యజమానులకు పరిహారం అందించడం అటవీశాఖకు తలకుమించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అటవీశాఖ పులులు గ్రామాల్లోకి రాకుండా అడ్డుకట్ట వేయడంతోపాటు వాటి రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా హైదరాబాద్ జూపార్క్ నుంచి జింకలను తెచ్చి కాగజ్నగర్ కారిడార్లో వదిలిపెట్టాలని నిర్ణయించింది.
పులుల ఆహార ఖర్చు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. 2021-22లో కొన్ని లక్షలుగా ఉన్న ఖర్చు 2023-24లో ఏకంగా రూ. 66 లక్షలు దాటింది. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన పులులతో కాగజ్నగర్ కారిడార్లో పులుల సంచారం గణనీయంగా పెరిగింది. వీటి ఆకలి తీర్చే జంతువులు అడవిలో లేకపోవడంతో వీలైనంత త్వరగా జింకలను తీసుకొచ్చి వదలాలని అటవీశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ జూపార్క్ నుంచి 200, కరీంనగర్ ఎల్ఎండీ డీర్పార్క్ నుంచి 50 చుక్కల దుప్పులను తీసుకొచ్చి అడవిలో వదిలి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమయయ్యాయి. మరోవైపు, చుక్కల దుప్పులు, నీల్గాయి, కొండగొర్రె, సాంబార్, అడవి పందుల వంటి శాకాహార జంతువుల సంతతిని పెంచే ప్రయత్నాలు చేస్తూనే వారం రోజుల వ్యవధిలోనే జింకలను అభయారణ్యంలో వదిలేందుకు రెడీ అవుతున్నది.
కాగజ్నగర్ కారిడార్లో ప్రస్తుత పరిస్థితికి వన్యప్రాణుల సమతుల్యత దెబ్బతినడమే కారణమని భావిస్తున్నారు. 2022లో 150 జింకలను పులలకు ఆహారంగా అడవిలో విడిచిపెట్టగా, వాటిలో సగానికిపైగా వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాయి. ఇంకోవైపు, పొలాలకు రక్షణగా కరెంటు తీగల అమర్చడంతో వాటికి తగిలి అడవి పందులు మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా పులులకు ఆహార కొరత ఏర్పడుతున్నది. దీనికితోడు మహారాష్ట్రలోని తడోబా పులల సంరక్షణ కేంద్రం నుంచి కాగజ్నగర్ కారిడార్లోకి వచ్చిన పులులు 12 కూనలకు జన్మనిచ్చాయి. తాజాగా, వాటిలో రెండు మృత్యువాత పడ్డాయి.
అధికారిక గణాంకాల ప్రకారం ఒక్క కాగజ్నగర్ డివిజన్లోనే 100కుపైగా పశువులు పులికి ఆహారమయ్యాయి. ఇందుకుగాను వాటి యజమానులకు అటవీశాఖ రూ. 18 లక్షలు పరిహారంగా అందించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు మరో 10 పశువులపై పులులు దాడిచేయగా వాటికి ఇవ్వాల్సిన పరిహారం పెండింగులో ఉంది. చెన్నూరులో 60 పశువులకు రూ. 8 లక్షలు, బెల్లంపల్లి డివిజన్ పరిధిలో 30కిపైగా పశువులకు రూ. 5 లక్షలు చెల్లించారు. మరో రూ. 10 లక్షలకు పైగా పరిహారం పెండింగులో ఉంది. ఒక్కో పులికి సగటున రోజుకు 40 కేజీల మాంసం అవసరం. ఈ లెక్కన కాగజ్నగర్ కారిడార్లోని 14 పులులకు 560 కేజీల మాంసం అవసరమవుతుంది. ఈ కారిడార్లో ఆహార కొరత వేధిస్తుండడంతో పులుల ఆయుర్దాయం ఐదేండ్లు తగ్గినట్టు గుర్తించారు.
ఒక్కో పులి సాధారణంగా దాదాపు 1000 హెక్టార్ల పరిధిలో తన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ లెక్కన కాగజ్నగర్ కారిడార్ 9 పులులకు మాత్రమే చోటు ఉంది. మిగలిన పులులు ఆవాసం లేక, ఆహారం దొరకక సమీపంలోని గ్రామాలపై పడుతున్నాయి. ఆవాసం కోసం మూడు పులులు వేమనపల్లి, కుశ్నపల్లి, నెన్నెల, బెల్లంపల్లి రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతానికి వెళ్లాయి. అక్కడ కూడా ఆహార కొరత వేధిస్తుండడంతో సమీప గ్రామాలపై పడుతున్నాయి. ప్రస్తుతం కాగజ్నగర్ కారిడార్లోని వాంకిడి, సిర్పూర్(టి), పెంచికల్పేట, దహేగాం, కాగజ్నగర్ మండలాల్లో పులుల సంచారం గణనీయంగా ఉండడంతో వాటి ఆకలి తీర్చడంతోపాటు ప్రాణాలు కాపాడేందుకు రక్షణ చర్యలు చేపట్టారు.