రాయికల్, ఆగస్టు 8: లంచం తీసుకుంటూ ఉపాధి హామీ ఈసీ దీపిక ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ కరీంనగర్ ఇన్చార్జి డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజిపేటకు చెందిన రైతు కోల శంకరయ్య ఈజీఎస్ కింద గత ఏడాది పశువుల షెడ్డు నిర్మించుకున్నాడు. ఇందుకోసం రూ.45 వేల బిల్లు కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు.
ఎంబీ రికార్డు చేసేందుకు ఈజీఎస్ మండల ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఎం దీపిక, టెక్నికల్ అసిస్టెంట్ రూ.5 వేలు లంచం డిమాండ్ చేయగా రూ.4 వేలకు ఒప్పందం కుదిరింది. మంగళవారం రాయికల్లోని కార్యాలయంలో ఈసీ దీపికకు శంకరయ్య రూ.4 వేలు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరో ఉద్యోగి టీఏ విజ్రేష్ పరారైనట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. దీపికను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతామని వారు పేర్కొన్నారు.